దేశ రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వం మరో ముఖ్య దశకు చేరుకుంది. గురువారం (ఏప్రిల్ 9)న కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు ప్రాంతాల్లో కలిపి 6 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి మరోసారి గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ బలంగా పోటీ చేస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి పోటీలో నిలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 2.5 కోట్ల మంది ఓటర్లు ఉండగా, యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది.
ఇక కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ఎప్పటిలాగే ప్రధాన పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ తిరిగి పగ్గాలు చేపట్టాలని కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 2.7 కోట్లకు పైగా ఓటర్లు ఉండటం గమనార్హం.
పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. ఎన్డీయే కూటమి ఇక్కడ బలంగా ఉండగా, ప్రతిపక్ష పార్టీలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. మొత్తం 9 లక్షలకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకే కాకుండా జాతీయ పార్టీలకు కూడా అత్యంత ప్రాధాన్యంగా మారాయి. ప్రజాభిప్రాయం ఏ దిశగా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. పోలింగ్ ప్రశాంతంగా జరగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి.
ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడించనున్నారు. అదే రోజున ఇతర కీలక రాష్ట్రాల ఫలితాలు కూడా వెలువడనున్న నేపథ్యంలో, దేశ రాజకీయ దిశపై ఈ ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.

































