Puri Jagannath : పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మారి పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు.

అయితే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో… పూరి, రామ్ గోపాల్ వర్మకు అసిస్టెంట్ డైరెక్టర్గా అనేక తెలుగు చిత్రాలకు ప్రధానంగా యాక్షన్ జానర్లో పనిచేశారు. ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ తన ప్రియురాలితో ఒక పందెం కాస్తాడు అనే కాన్సెప్టుతో పూరి జగన్నాథ్ ఒక కథ రాసుకున్నాడు. శివ ఆ తదుపరి చిత్రాలు నాగార్జునతో రాంగోపాల్ వర్మ రూపొందించారు. కావున నాగార్జునతో కొంత పరిచయం ఉండటం వలన ఆ కథను అమలకు వినిపించారు. ఎందుకనో ఈ కథ పట్ల ఆమె అంతగా ఆసక్తి చూప లేకపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తే అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాలని పూరి అనుకున్నారు.

ఓ నవలా రచయిత ఈ కథను చదివి.. నా పేరుతో నవల పబ్లిష్ చేయిస్తాను. అవసరమైతే నీకు పదివేల రూపాయలు కూడా ఇస్తానన్నారు. దానికి దర్శకుడు పూరి నవలగా కొన్ని పేజీలతో కథను రాశారు. పూరి తన మనసులో ఏ మూలనో అలా చేయడం నచ్చలేదు. తిరిగి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్ ని కలవాలి ఎలా? పార్టీలలో కలుద్దాం అంటే పవన్ పార్టీలకు హాజరుకాడు. పోనీ సినిమా ఫంక్షన్ లో కలుద్దామా? అంటే అక్కడికి కూడా ఆయనరారు. పోనీ షూటింగ్స్ లో కలుద్దాం అంటే అవుటర్స్ ఆర్ నాట్ ఆలవుడ్. అప్పటికి తొలిప్రేమ షూటింగ్ లో కలుద్దామని ప్రయత్నించారు. అలా 6నెలలు గడిచి పోయింది. అయినా పూరి ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. కళ్యాణ్ బంధువుతో మళ్ళీ ప్రయత్నించాడు కానీ తిరుగు ముఖం పట్టాడు.

శ్యామ్ కె.నాయుడు పరిచయం ఉండడం వలన ఆయన సోదరుడు కెమెరామెన్ చోటా కె.నాయుడుని వెళ్లి కలిశాడు. ముందు ఆ కథేంటో తనకు చెప్పాలని అప్పుడే పవన్ కళ్యాణ్ తో కల్పిస్తానని ఆయన చెప్పారు. పూరి ఇదివరకే రాసుకున్న “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” కథను చెప్పడం జరిగింది. ఆ కథ చోటా కె.నాయుడుకి నచ్చడంతో 1999 ఆగస్టు 24 తెల్లవారుజామున 4 గంటలకు పవన్ కళ్యాణ్ తో స్టోరీ సిట్టింగ్స్ లో చోటా కె.నాయుడు, పూరి జగన్నాథ్, కూర్చున్నారు. కానీ పూరి మాత్రం బద్రి స్టోరీ చెప్పారు. చోటా కె నాయుడు ఆశ్చర్యంగా చూశారు. అవును బద్రి సినిమా స్టోరీ గనుక చెప్పుంటే మీకు నచ్చుండేది కాదు. తర్వాత నాకు పవన్ కళ్యాణ్ తో అపాయింట్మెంట్ ఉండేది కాదని చోటా కె.నాయుడుతో పూరి అన్నారు. అందుకే మీకు ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పాను క్షమించండని అన్నారు.

స్టొరీ బాగుంది కానీ క్లైమాక్స్ నాకు నచ్చలేదు దీన్ని మార్చి తీసుకొని రండని పవన్ కళ్యాణ్, పూరితో అన్నారు. స్టోరీ నచ్చినందుకు సంతోషపడాలో క్లైమాక్స్ మార్చి తీసుకురమ్మన్నందుకు బాధ పడాలో అర్థం కాలేదు. తిరిగి ఇంటికి వెళ్లి క్లైమాక్స్ మీద పూరీ కసరత్తు చేశారు. కానీ ఆ స్టోరీ క్లైమాక్స్ ఒక్కటి కూడా పూరికి నచ్చలేదు. నిర్మొహమాటంగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి స్టోరీ క్లైమాక్స్ ఏడు రాశాను సార్ కానీ పాతదే బావుందని డైరెక్టుగా చెప్పేశాడు. అందుకు పవన్ కళ్యాణ్ స్టోరీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో తెలుసుకోవడానికి క్లైమాక్స్ మార్చమని చెప్పాను. కానీ మీరు మార్చకుండా తీసుకువచ్చారు అది నాకు బాగా నచ్చింది. కంగ్రాట్స్ అంటూ పూరి జగన్నాద్ భుజాన్ని తట్టారు.

వెంటనే నిర్మాత త్రివిక్రమ రావు కి ఫోన్ చేసి స్పాట్ కి రమ్మన్నారు. త్రివిక్రమరావు వెంటనే అక్కడికి చేరుకున్నారు.. మనం తీయబోయే సినిమాకి ఈయనే దర్శకుడు అని పూరి జగన్నాథ్ కి త్రివిక్రమరావుని కళ్యాణ్ పరిచయం చేయించారు. సినిమాకి సంబంధించిన మిగతా విషయాలన్నీ మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. పూరికి 50000రూ.లు అడ్వాన్స్ త్రివిక్రమరావు ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకొని పూరి జగన్నాథ్ చాలా సంతోషపడ్డారు. ఫిలింనగర్ టర్నింగ్ లో మూడు లక్షలు రూ.లు అప్పు చేసి ఆఫీస్ తీసుకుని డెకరేట్ చేశారు.

సినిమాకి ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండటంతో చలో ముంబై అంటూ వెళ్లి కో-డైరెక్టర్ సహాయంతో మెయిన్ హీరోయిన్ గా రేణుదేశాయ్, రెండో హీరోయిన్ గా అమీషా పటేల్ ని బుక్ చేశారు. ముందు ఈ సినిమాకి “చెలి” అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ మరీ సింపుల్ గా ఉంటుందని “బద్రి” అని టైటిల్ చివరికి నిర్ణయించారు. అలా 2000 ఏప్రిల్ 20న “బద్రి” సినిమా విడుదలైంది. మొదట డివైడ్ టాక్ వచ్చింది. నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రీనాథ్ అనే డైలాగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవడంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
































