సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రజినీకాంత్ ఇటీవలె అనారోగ్యం కారణంగా చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం మన అందరికి తెలిసిందే.రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు.ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని కావేరి హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.

రజనీకాంత్కు వంట్లో నలతగా ఉండటంతో ఆయన అసౌకర్యానికి గురయ్యారని అందుకే చెన్నై ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో గురువారం చేరారని వైద్యులు హెల్త్ బులెటిన్లో వివరించారు.
అయితే తాజాగా రజినీకాంత్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.తాను ఇంటికి చేరుకున్న విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. చికిత్స పూర్తి అయింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు చేసిన నా మిత్రులకు , శ్రేయోభిలాషులకు, అభిమానులకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని రజనీకాంత్ తెలిపారు.
ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత రజనీకాంత్కి కాస్త నలతగా అనిపించడంతో ఆయన కావేరి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్యులు ఆయన్ని పరిశీలించి మెదడులోని నరాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి చికిత్స అందించారు. కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు.
దీంతో రజనీకాంత్ శస్త్ర చికిత్సకు ఓకే చెప్పడంతో కరోటిడ్ ఆర్టరీ రివాస్కులైజేషన్ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. రెండు రోజుల పాటు హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకున్న రజినీకాంత్ తాజాగా ఇంటికి చేరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే తలైవా నటించిన అన్నాత్తె చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. తెలుగులో పెద్దన్న పేరుతో రిలీజ్ కానుంది.తమ అభిమాని హీరో కోలుకొని ఇంటికీ రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





























