సౌత్ ఇండస్ట్రీలో పాపులారిటీ గల నటి రష్మిక మందన్నా తాజాగా చేసిన ఓ కామెంట్ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురి చేసింది. కొడవ సమాజం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన తొలి నటిని తానేనని ఆమె ఇటీవల గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు కోడవ ప్రజల్లోనూ, సినీ ప్రేమికుల్లోనూ ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఆమెకంటే ముందే కొడవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారనే విషయం చాలామంది గుర్తుచేస్తున్నారు.

రష్మిక చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా నిజానికి విరుద్ధమంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. “మీ అజ్ఞానాన్ని అందరిపై రుద్దొద్దు”, “ఇంత త్వరగా మీరు మర్చిపోతారా?”, “తప్పు సమాచారం ఇచ్చి మీను గొప్పవాళ్లలా చూపించుకోవొద్దు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమెకంటే ముందే నటి ప్రేమ, నటుడు గుల్షన్ దేవయ్య లాంటి వారు కొడవ జాతిని ప్రాతినిధ్యం వహిస్తూ ఇండస్ట్రీలో రాణించారని స్పష్టంగా గుర్తుచేశారు.
ఈ వివాదంపై నటి ప్రేమ కూడా స్పందిస్తూ, “ఈ విషయంలో నేను చెప్పేది ఏముంది? కొడవ సమాజానికి నిజం ఏంటో తెలుసు” అని స్పందించారు. అలాగే, “రష్మికకు మేము అందించిన అవకాశాలు, మార్గదర్శకతే ఆమెకు ఈ స్థాయికి తీసుకువచ్చింది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
సమాజానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి వచ్చిన ప్రముఖులు, నటీనటులు ఇలా అసత్య ప్రచారాలు చేయడం తగదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రష్మిక వ్యాఖ్యలు ఆమెకు తగిన ఫలితాన్ని కాకుండా, ట్రోలింగ్ రూపంలో ప్రతిద్వని ఇచ్చినట్లైంది.



























