తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హాస్య నటీమణిగా పేరు తెచ్చుకున్న రమాప్రభ మహానటుల సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటిగా నటించి తెలుగు ప్రేక్షక అభిమానులను ఎంతగానో అలరించారు. ఆమె తన తమ్ముడు గా భావించే దివంగత నటుడు రాజబాబు తో కలసి దాదాపు 300 పైచిలుకు సినిమాల్లో నటించారు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో వీళ్ళిద్దరి కాంబినేషన్ కు చాలా డిమాండ్ ఉండేది. అలాగే అల్లు రామలింగయ్య, రమణారెడ్డి వంటి గొప్ప హాస్య నటుల సరసన కూడా నటించి వాహ్వా అనిపించారు.

కమెడియన్ రేలంగి సరసన ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో కూడా నటించి తన నటనా చాతుర్యాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించారు. సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఆమె శరత్ బాబు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ 13 సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించారు కానీ తరువాత మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడిపోయారు. తదనంతరం అడపాదడపా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మొన్నటి వరకు అలరించారు రమాప్రభ. ఎక్కువగా మదనపల్లిలో తన సమయాన్ని గడిపే రమాప్రభ సినిమా షూటింగ్ల నిమిత్తం నగరానికి విచ్చేస్తారు తప్ప మిగతా అన్ని సమయాల్లో మదనపల్లి దాటి వెళ్లరు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమాప్రభ ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు వెల్లడించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన అల్లుడు అని, ఏడాది వయసులో ఉన్న తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని తాను దత్తత తీసుకున్నానని, ఆమెని రాజేంద్రప్రసాద్ కు ఇచ్చి పెళ్లి చేశానని రమాప్రభ వెల్లడించారు. అలాగే ‘మా’ అసోసియేషన్ వల్ల తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు. తాను చనిపోయినా… ఆ విషయాన్ని మా అసోసియేషన్ కి ఎవరు చెప్పవద్దని ఆమె ఇంటర్వ్యూ లో కోరుతూ అందరినీ కంటతడి పెట్టించారు. మా అసోసియేషన్ వారు తనని అవమానించడం తో పాటు ఏ రోజు కూడా సముచిత గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరొక విస్తుపోయే నిజమేమిటంటే ఒకానొక దశలో రాజేంద్రప్రసాద్ మా అసోసియేషన్ కి చీఫ్ గా బాధ్యతలు వ్యవహరించారు. కానీ ఆ సమయంలో కూడా రమాప్రభ గౌరవ భంగం తప్ప లేదట.

































