Sai Pallavi : సాయి పల్లవి డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయ్యి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సినిమా హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ క్రేజీ హీరోయిన్ గా మారింది. ఫిదా సినిమాతో తెలుగు తెర కు పరిచయం అయ్యి అందరినీ తన నటన, డాన్స్ తో ఫిదా చేసింది. తెలుగు లేడీ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వం తో అభిమానులను కట్టిపడేస్తోంది. ఇటీవల విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాయి పల్లవి. సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా సాయి పల్లవికి మంచి మార్కులే పడ్డాయి. అయితే మరోసారి జులై 15న గార్గి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది.

ఏడవ తరగతిలోనే ఒక అబ్బాయికి లవ్ లెటర్…
గార్గి సినిమా విడుదల దగ్గర ఉండటం తో సాయి పల్లవి ప్రమోషన్ లలో చురుకుగా పాల్గొంటోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర బృందం ఒక ‘మై విలేజ్ టాక్ షో’ ను ప్రారంభించింది. నెట్ ఫ్లిక్స్ గంగవ్వ హోస్ట్ గా ఈ టాక్ షోను ప్రారంభించింది. ఈ టాక్ షోలో సాయి పల్లవితో పాటు రాణా కూడా పాల్గొన్నాడు. గార్గి సినిమాను రాణా తెలుగులో విడుదల చేయబోతున్నారు. టాక్ షో లో పాల్గొన్న సాయి పల్లవిని గంగవ్వ ఆసక్తికర ప్రశ్న అడిగింది.

విరాట పర్వం సినిమాలో రవన్న పాత్రకు నువ్వు లవ్ లెటర్ రాశావు కదా, నిజ జీవితం లో కూడా ఎవరికైనా లవ్ లెటర్ రాశావా అని గంగవ్వ సాయి పల్లవిని ప్రశ్నించింది. అందుకు సాయి పల్లవి.. ‘నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడే ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. దాన్ని చూసి నా పేరెంట్స్, నన్ను చాలా బాగా కొట్టారు’ అని సమాధానం చెప్పుకొచ్చింది. ఎందరో అబ్బాయిలు ఇష్టపడే సాయి పల్లవి ఒకరికి ఏడవ తరగతిలోనే ప్రేమ లేఖ రాసిందన్నమాట.



























