Saina Nehwal-Siddharth: యాక్టర్ సిద్ధార్థ్ సైనా నెహ్వాల్ పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటీవల పంజాబ్ లో ఫిరోజ్ పూర్ పర్యటనలో ప్రధాని భద్రత వైఫల్యంపై స్పందిస్తూ… ఆ ఘటనను ఖండించింది సైనా నెహ్వాల్. అయితే ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్.. సైనా నెహ్వాల్ ను ఉద్దేశిస్తూ..ట్విట్టర్ వేదికగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ కూడా సిద్ధార్థ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని ట్విట్టర్ ఇండియాను కూడా ఆదేశించింది. మహారాష్ట్ర డీజీపీకి కూడా సిద్ధార్థ్ పై కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది.

ఈ విషయంపై సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ ఫైర్ అయ్యారు. తన కుమార్తెపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించిన హర్వీర్ సింగ్.. దేశం కోసం సిద్ధార్థ్ ఏం చేశాడని ప్రశ్నించాడు. సైనాపై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. `నా కూతురుని ఉద్దేశించి సిద్ధార్థ్ వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. అసలు ఆయన దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది. దేశ ప్రతిష్టని పెంచిందని అన్నాడు.
మేజర్ ధ్యాన్చంద్, ఖేల్ రత్న అవార్డు..
బ్యాట్మింటన్ క్రీడాకారిణిగా అనేక పథకాలను దేశానికి తెచ్చింది సైనా నెహ్వాల్. 2012 లండన్ ఒలింపిక్స్లో సైనా కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. ఇండియాకి ఆమె చేసిన సేవలకుగానూ 2009లో కేంద్ర ప్రభుత్వం అర్జున పురస్కారంతో, అలాగే మేజర్ ధ్యాన్చంద్, ఖేల్ రత్న అవార్డుని అందజేసింది. అలాగే 2010లో పద్మ శ్రీ పురస్కారం, 2016లో పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఇదిలా ఉంటే సైనా నెహ్వాల్ ప్రస్తుతం బీజేపీలో సభ్యురాలిగా ఉన్నారు.





























