మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ సినిమా అంటే ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరిలో లాగే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకు కారణం ఆయన సినిమాలో మాటలే తూటాల్లా దూసుకెల్తాయి కాబట్టి. కొన్ని డైలాగులు జనాల మనసులను గట్టిగా తాకుతాయి.

ప్రతీ అక్షరం, పదం ఎంతో జాగ్రత్తగా అమర్చి త్రివిక్రం రాసే డైలాగ్స్ కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి. మనకి వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు..రానిది ట్రై చేయకూడదు. జులాయి సినిమాలో త్రివిక్రం రాసిన డైలాగ్. ఇది ఎంతమంది తమకి తాము ఆపాదించుకున్నారో లెక్కేలేదు.

బాచిరెడ్డి చస్తే మీరు సీఎం అవుతారు..అతణ్ని చంపితే మీరు హంతకుడవుతారు..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు.. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమీ ఉండదు.. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే బావుంటుంది, గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పొచ్చు కానీ గుండెల్లో ఉన్న మాట కళ్లతోనే చెప్పగలం, అందంగా ఉండటం అంటే మనకి నచ్చినట్టు ఉండటం.. ఎదుటి వారికి నచ్చినట్టు ఉండటం కాదు.. నిజం చెప్పేటప్పుడే భయమేస్తుంది నాన్నా.. చెప్పకపోతే ఎప్పుడు భయమేస్తుంది.. ఇలాంటి ఎన్నో డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

అందుకే ఆయన మాటల మాంత్రీకుడు అయ్యారు. సామాన్య ప్రేక్షకుడికి కూడా త్రివిక్రం రాసే మాటలు హృదయంలోకి దూసుకు వెళతాయి. అందుకే త్రివిక్రం సినిమాలకి అన్నీ వర్గాల ప్రేక్షకులు ఉంటారు. అయితే ఆయన త్రివిక్రం సినిమాలలో చాలా వరకు కాపీ సన్నివేశాలుంటాయని తరచూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన అతడు, ఖలేజా, జులాయి, అ..ఆ, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అలాగే గత చిత్రం అల వైకుంఠపురము లో లాంటి సినిమాలలో కొన్ని సీన్స్ ఆయన హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ చేశారని ప్రచారం జరిగింది.

అ..ఆ సినిమాను అప్పటి మీనా నవల, చిత్రం ఆధారంగా తీసినట్టు ఆయనే ఒప్పుకున్నారు. అలాగే అల్లు అర్జున్ – పూజా హెగ్డే జంటగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా కూడా సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ఇంటిగుట్టు అనే సినిమాకి కాపీ అని ప్రచారం జరిగింది. సినిమాకి ముందు జరిగిన ప్రచారమే తర్వాత సినిమా రిలీజయ్యాక కూడా చేశారు. ఇవన్నీ జనాలు పట్టించుకోలేదు. అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. 2020 సంక్రాంతి బరిలో దిగి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి థమన్ మ్యూజిక్ ప్రధాన కారణం అయింది. భారీ మ్యూజికల్ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు దక్కాయి. అంతేకాదు తాజాగా సాక్షి అవార్డ్స్లో కూడా అల వైకుంఠపురానికి 5 అవార్డులు దక్కడం గొప్ప విశేషం.

ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా హీరోయిన్ పూజా హెగ్డే, ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధా కృష్ణ, ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ అవార్డులను దక్కించుకున్నారు. కాపీ మరకలంటించిన అల వైకుంఠపురములో చిత్రానికి ఇలా అవార్డుల పంట పండటం మాత్రం గొప్ప విశేషం.































