Senior Journalist Bhardwaja : ఫిబ్రవరి 2న అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ దిగ్గజ డైరెక్టర్ కళా తపస్వి కే విశ్వనాథ్ గారు 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన తెలుగులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీసి ప్రేక్షకులను అలరించారు. ఆయన తీసిన మొదటి సినిమా నుండే అవార్డులు, సత్కారాలు ఆయనకోసం క్యూ కట్టాయి. ఇక ఆయన తీసిన ఎన్నో చిత్రాల్లో భారతీయ సంస్కృతి అలాగే కళలను ముందు తరాల వారికి అందించారు. ప్రతి సినిమాలోనూ ఆయన చెప్పాలనుకున్న కథతో మిళితంగా సమాజానికి ఏదో ఒక సందేశం ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన విశ్వనాథ్ గారికి నటుడు చంద్రమోహన్ అలాగే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం బంధువులవుతారు. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

అన్నదమ్ములైనా ఇండస్ట్రీకి వచ్చే వరకు తెలియదు…
విశ్వనాథ్ గారికి నిజానికి సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆసక్తి, ఇష్టం పెద్దగా లేకపోయినా తండ్రి ఆల్రెడీ వాహిని స్టూడియోలో పనిచేస్తూ ఉండటం వలన ఆయన మాట కాదనలేక సౌండ్ రికార్డింగ్ అసిస్టెంట్ గా చేరారట. అయితే ఏ పని అయినా నిబద్ధతతో చేసే విశ్వనాథ్ గారు అదుర్తి సుబ్బారావు గారి కంట్లో పడటం అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రావడం అనతి కాలంలో డైరెక్టర్ గా ‘ఆత్మ గౌరవం’ సినిమాను నాగేశ్వరావు గారితో తీయడం జరిగిపోయాయి. ఇక విశ్వనాథ్ గారి తండ్రికి ఇద్దరు భార్యలు, మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. అలా మొదటి భార్య చెల్లెలు కొడుకు చంద్రమోహన్ అవడంతో వారిద్దరూ సోదరులు అవుతారు.

ఇక చంద్ర మోహన్ గారి బావమరిది చెల్లిని బాలసుబ్రమణ్యం గారి అన్న పెళ్లి చేసుకోవడం వల్ల వారిద్దరూ కూడా బంధువులయ్యారు. అయితే ముగ్గురికీ తాము బంధువులు అనే విషయం ఇండస్ట్రీలో వీరు స్థిరపడ్డాకే తెలిసింది. వేర్వేరు చోట్ల కుటుంబాలు స్థిరపడటం వల్ల వారు బంధువులనే విషయం తెలియదట. ఇక ప్రతి ఇంట్లోనూ అభిప్రాయబేధాలు మామూలే అలానే వీరి ముగ్గురికీ కూడా అప్పుడప్పుడు అభిప్రాయబేధాలు వచ్చినా ముగ్గురూ బాగా కలిసి ఉండేవారు. చంద్ర మోహన్, విశ్వనాథ్ గారు చెన్నైలో పక్కపక్కన ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. అలా వీరు ముగ్గురూ సినిమా ఇండస్ట్రీలోకి తెలియకుండా వచ్చిన అన్నదమ్ములు, ముగ్గురూ ఇండస్ట్రీని ఏలారు.































