కరోనా మహమ్మారి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ మరణ మృదంగం మ్రోగిస్తోంది. ఏరోజుకారోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ లాక్ డౌన్ సడలింపులతో వైరస్ మరింతగా విజృంభిస్తోంది. దీంతో ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తనను కరోనా కాటేసిందని స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబందించిన ఓ వీడియోను విడుదల చేశారు బాలుగారు.

ఆ వీడియోలో తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని, జ్వరంతో పాటు దగ్గుతో కూడా బాధ పడుతున్నానని, దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులు, శ్రేయోభిలాషులకు విన్నవిస్తూ.. ఎలాంటీ ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపాడు. దయచేసి ఎవరూ ఫోన్లు చేయవద్దని కోరారు. గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారు త్వరలో కోలుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో మళ్లీ మనముందు మంచిమంచి కార్యక్రమాలు నిర్వహించాలని భగవంతుని కోరుకుందాం.




























