ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా జూన్ 7వ తేదీన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో శాండిల్వుడ్ పరిశ్రమ శోక సముద్రంలో మునిగిపోయింది.
2009లో వాయుపుత్ర మూవీతో వెండితెరపై అడుగు పెట్టారు చిరంజీవి సర్జ. తొలి మూవీతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు 25 సినిమాల్లో నటించాడు. ప్రముఖ కన్నడ హీరోయిన్ మేఘనా రాజ్ను 2018లో పెళ్లి చేసుకున్నాడు చిరంజీవి సర్జ. ఆయన హఠాత్మరణంపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ.. చిరంజీవి సర్జా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ కాలమిస్ట్, నవలా రచయిత్రి శోభా డే ఓ సంచలనమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్తో మెగాస్టార్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి సర్జా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేయడంలో భాగంగా పెద్ద పొరపాటే చేశారు రచయిత్రి శోభా డే. చిరంజీవి మృతిపై ట్విట్టర్లో శ్రద్దాంజలి ఘటిస్తూ.. ‘మరో యువ నటుడు ఈ లోకం విడిచి వెళ్లిపోయారని, ఈ విషాదకరమైన వార్త తనని షాక్ కి గురిచేసిందని అన్నారు. ఆయన మరణం పూడ్చలేనిదని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని’ పోస్టు పెట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ట్వీట్లో చిరంజీవి సర్జా ఫోటోకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టారు. దీంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది.

ఇక ఈ ట్వీట్ చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్.వెంటనే ఆమెపై ఓ రేంజ్లో కామెంట్స్ చేయటం మొదలు పెట్టారు. ‘కనీసం ఎవరు చనిపోయారో తెలియకుండా ఎవరి ఫోటో పడితే వారి ఫోటోను పెట్టి ట్వీట్ చేసేస్తావా.?’ అంటూ మెగాస్టార్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత తన పొరపాటును తెలుసుకున్న ఆమె.. తాను చేసిన తప్పును సరిద్దిద్దుకొన్నారు. ఆ ట్వీట్ను వెంటనే తన ట్విట్టర్ ఖాతా నుండి డిలీట్ చేశారు. అయినా సరే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. చూద్దాం మెగాఫ్యాన్స్ ఆగ్రహం ఎప్పటికి చల్లారుతుందో.?!



























