ప్రపంచంలో టాప్ టెన్ బెస్ట్ నటులలో ఎస్.వి.రంగారావు ఖచ్చితంగా ఒక స్థానాన్ని సంపాదించుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అతని నటనకు దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి గారే ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు. పాతాళభైరవి సినిమాలో నేపాల మాంత్రికుడు పాత్రలో ఎస్.వి రంగారావు పలికించిన హావభావాలు… చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అతని నటన ఒక్కసారి చూస్తే మన మెదళ్ళలో శాశ్వతంగా ముద్ర పడిపోతుంది. ఒక పాత్రలో ఎలా నటించాలో ముందుగానే మైండ్ మ్యాప్ గీసుకొని ఆ పాత్రలో సహజంగా జీవించగల ఎస్.వి.రంగారావుకు హీరోలతో సమానంగా క్రేజ్ ఉండేదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

అతని నటనా ప్రతిభను చూసిన విదేశీ ప్రముఖ నటులు కూడా అబ్బురపడి అతనిని తెగ పొగిడినారు. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు పాత్రలో ఎస్.వి.రంగారావు నటనకి యావత్ భారతదేశం ప్రశంసించింది అంటే అతిశయోక్తి కాదు. అతను నటించిన ప్రతి పాత్రకి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే ఏమో అనిపిస్తుంది. చిరంజీవి, కమల్ హాసన్, గుమ్మడి వంటి అత్యద్భుతమైన నటులు ఎస్వీ రంగారావు గారిని ప్రేరణగా తీసుకొని సినీ రంగంలో అడుగు పెట్టారు. షావుకారు జానకి సినిమా కంటే ముందుగానే ఎస్.వి.రంగారావు వరూధిని అనే సినిమాలో ప్రవరాఖ్యుడు పాత్రలో నటించి ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యారు. ఈ సినిమా 1946వ సంవత్సరంలో విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాలోని ఎస్.వి.రంగారావు సరసన దాసరి తిలకం గారు నటించారు.

ఈ సినిమా తర్వాత ఎస్.వి.రంగారావు మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఎదురు లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్లారు. నిజానికి అప్పట్లో సహ నాయకుడు, విలన్ పాత్రలలో ఎస్.వి.రంగారావు కంటే అద్భుతంగా ఎవరు నటించలేకపోయే వారు. దీంతో నేనే గొప్ప నటుడిని అనే దర్పం చూపించేవారట ఎస్.వి.రంగారావు. హీరోల కంటే తనకు ఒక రూపాయి ఎక్కువగానే రెమ్యూనరేషన్ ఇవ్వాలనే కండిషన్ కూడా పెట్టేవారట. నిర్మాతలు, దర్శకులు అతనికంటే మంచి నటుడు దొరికడని భావించి అన్ని భరించి అతనికి ఎక్కువ పారితోషికం ఇచ్చేవారట. ఎస్.వి రంగారావు తను నటించే సినిమాలో ఇతర నటీనటులు నచ్చకపోతే తీసేయమని చెప్పేవారట. ఇలా తాను చాలా గొప్ప నటుడిని అని అతనిలో కాస్త అహం ఉండేదట.



























