ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కుమారుడు తన సొంత తల్లిని అమానుషంగా హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లి ప్రేమను మరచిపోయిన కుమారుడు, ఆమెను ఇంట్లో బంధించి సజీవదహనం చేయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఒంగోలు పరిధిలోని గద్దలగుంట్ల ప్రాంతంలో నివసిస్తున్న వెంకటరమణమ్మ (సుమారు 70) తన కుమారుడు కిషోర్తో కలిసి జీవిస్తోంది. కొద్ది నెలల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. అయితే కిషోర్కు మద్యం అలవాటు ఎక్కువగా ఉండడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.
తాజాగా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కిషోర్, తల్లితో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెను ఇంట్లో బంధించి తాళం వేసి, పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వెంకటరమణమ్మ బయటపడే అవకాశం లేకుండా అక్కడికక్కడే సజీవదహనమైంది.
ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉందని అధికారులు తెలిపారు. మృతురాలి శరీర అవశేషాలను సేకరించి పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ ఘటన అనంతరం నిందితుడు కిషోర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కుటుంబ సభ్యులు, స్థానికుల వాంగ్మూలాలు నమోదు చేస్తూ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం వ్యసనం ఎలా కుటుంబాలను చీల్చి వేస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. సొంత తల్లిని ఇంత క్రూరంగా హత్య చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



























