తెలుగు సినిమా పరిశ్రమ ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిందంటే దానికి కారణం కె.వి.రెడ్డి, బి.యన్.రెడ్డి, చక్రపాణి, విటలాచార్య, డి రామానాయుడు ఇలా చాలా మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఐతే తెలుగు సినిమా పరిశ్రమ యొక్క నాలుగు పిల్లర్లలో దగ్గుబాటి కుటుంబాన్ని ఒక పిల్లర్ గా వర్ణించవచ్చు.

మూవీ మొగల్ గా పేరు సంపాదించిన డాక్టర్ డి.రామానాయుడు ప్రముఖ నిర్మాతగా అవతారమెత్తి తెలుగు ప్రేక్షకులకు ఎన్నో సినిమాలను సమర్పించి అరుదైన రికార్డులను నెలకొల్పారు. పెద్ద హీరోలను, హీరోయిన్లను, దర్శకులు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఒక్క డి.రామానాయుడు గారికే దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. తన తనయులు వెంకటేష్ హీరోగా, సురేష్ బాబు నిర్మాతగా తెలుగులో ఎన్నో సినిమాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని చెప్పుకోవచ్చు.

దగ్గుబాటి వంశం మూడవ తరం కూడా రానా రూపంలో దివ్యంగా వెలిగిపోతుంది. డాక్టర్ డి. రామానాయుడు తన జీవితంలో… బ్రతుకు బ్రతికించు అనే ఒకే ఒక సిద్ధాంతాన్ని బాగా నమ్మేవారు. ఇతరులకు కూడా ఆ సిద్ధాంతం చెబుతూ తాను కూడా అదే పాటిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన మహనీయుడు డి. రామానాయుడు. అయితే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అంటుంటారు. డి.రామానాయుడు విజయాల వెనుక కూడా అతని సతీమణి ఉన్నారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. గ్రామంలో ఉన్న వ్యవసాయాన్ని వదిలేసి సినిమా నిర్మాత అవ్వాలనుకున్నప్పుడు అందరూ అతనిని నిరుత్సాహపరిచారు కానీ అతని భార్య రాజేశ్వరి అతని వెన్నంటే ఉండి ముందుకు నడిపించారు.

రాజేశ్వరి డి.రామానాయుడు మేనమామ కూతురు కాగా… అతను తన బంధువైన ఒకరి ఇంట్లో ఉంటూ ఎస్ఎస్సి చదువుకుంటున్న రోజుల్లో తన మేనమామ ఇంటికి తరచూ వెళ్తుండేవారు. ఆ సమయంలోనే రాజేశ్వరిని చూసి ఆమెపై మనసు పారేసుకున్నారు రామానాయుడు. అప్పటికే రామానాయుడు పార్ట్ టైం కాంపౌండర్ గా పని చేస్తున్నారు. మనసుకు నచ్చిన రాజేశ్వరి ని తప్ప ఎవర్ని పెళ్లి చేసుకోవద్దని గట్టిగా నిర్ణయించుకున్న రామానాయుడు నేరుగా తన తండ్రి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు. దీంతో కొడుకు కోరికను కాదనలేక తన తండ్రి అతడిని రాజేశ్వరికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానంతరం రామానాయుడు గారిని చాలా చక్కగా చూసుకున్నారు రాజేశ్వరి.

ఆ కాలంలోనే రామానాయుడు గారికి వందల ఎకరాల్లో సేద్యపు భూమి ఉండేది. ఆమె కూడా రామానాయుడు గారితో కలిసి పొలాలకు వెళ్లేవారు. కూలీలతో పని చేయించడంతో పాటు తాను కూడా కాయకష్టం చేసేవారు. పంట పండించి విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బుల్లో మూడోవంతు డబ్బుని దాచి పెట్టేవారు. ఆ విధంగా లక్షల రూపాయలను దాచిపెట్టిన రాజేశ్వరి తన భర్త సినిమా రంగంలో అడుగుపెడుతున్నారని తెలిసి అతనికి డబ్బులు మొత్తం ఇచ్చేసింది. తన భార్య లక్షల రూపాయలను ఇస్తుంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన రామానాయుడు తర్వాత విషయం తెలిసి ఆమెను తెగ మెచ్చుకున్నారు. ఈ విధంగా భార్య చెమటోడ్చి పొదుపు చేసిన డబ్బులతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి తిరుగులేని నిర్మాతగా ఎదిగారు రామానాయుడు. భార్య చేతి మహిమో ఏమో కానీ తాను ఏ సినిమా తీసినా అది సూపర్ హిట్ చిత్రంగా మారిపోయేది. సింపుల్ గా చెప్పాలంటే అతను పట్టిందల్లా బంగారమే అయ్యింది.



























