Chiranjeevi : 1986, ప్రముఖ విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ తన సోదరుడితో కలిసి ఓ సినిమా నిర్మించాలనుకున్నారు. ఆ క్రమంలో చిరంజీవిని సంప్రదించగా కైకాల సోదరులకు డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో వారు మెగాస్టార్ తో అప్పట్లో “చిరంజీవి” అనే చిత్రాన్ని నిర్మించారు. కట్ చేస్తే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. చిరంజీవి ఆలా డేట్స్ ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేక పోయెమే అన్న భావన కైకాల సత్యనారాయణ మనసులో ఎప్పుడూ ఉండేది.

ఆ క్రమంలో కైకాల నాగేశ్వరరావు తిరిగి చిరంజీవితో ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అప్పుడు కౌబాయ్ చిత్రం అయితే ఎలా ఉంటుందనే ఆలోచనలో భాగంగా హాలీవుడ్ లోని కొన్ని కౌబాయ్ చిత్రాలు చూసి వారు ప్రేరణ పొందారు. సినిమా కథ బాధ్యత విజయేంద్రప్రసాద్, శివశక్తి దత్త మీద పెట్టారు. ఆ ఇద్దరికీ రచయిత సత్యానంద్ కూడా తోడయ్యారు. కథ మంచి కమర్షియల్ హంగులతో రూపొందించబడింది. కానీ చిరంజీవి ఆ కథను ఒకసారి పరుచూరి సోదరులకు వినిపించాలని కోరారు. ఆ కథ విన్న పరుచూరి బ్రదర్స్ కొన్ని మార్పులు చూపించారు. ఆ తర్వాత సినిమాకి స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా తీసుకున్నారు.

ఈ మూవీ అప్పట్లో ఒక ట్రెండ్ను క్రియేట్ చేసింది. కౌబాయ్ సినిమా అంటే ఇలాగే ఉండాలని చాటి చెప్పింది. చిరంజీవి అప్పటికే కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొదమ సింహంకు చాలా టైమ్ కేటాయించారు. అయితే ఎట్టకేలకు సినిమా పూర్తయింది. నిర్మాత నాగేశ్వర్ రావు ఈ మూవీని నిర్మించగా.. దర్శకుడు మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించారు. ఇందులో రాధ, వాణీ విశ్వనాథ్ లతోపాటు సోనమ్ అనే హిందీ నటి కూడా యాక్ట్ చేసింది. అలాగే కైకాల సత్యనారాయణ, మోహన్బాబు, గొళ్లపూడి, కన్నడ ప్రభాకర్, ప్రాణ్ (హిందీ) లు ఇందులో కీలకపాత్రలు పోషించారు.

కొదమ సింహం మూవీ షూటింగ్ను 5 రాష్ట్రాల్లో చేశారు. ఇందులో హార్స్ రైడింగ్ కోసం చిరంజీవి అప్పట్లో రాజస్థాన్లో గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. చెంగల్పట్టులో కౌబాయ్ సెట్ వేశారు. అందులో 7 రోజుల పాటు షూటింగ్ సాగింది. 1989 సెప్టెంబర్ 21న ప్రారంభమైన షూటింగ్ సుదీర్ఘంగా సాగింది. ఈ మూవీలో మెగాస్టార్తో ప్రభుదేవా స్టెప్పులేయించారు. రాజ్ కోటి సంగీతం అందించారు. ఈ క్రమంలోనే మూవీలోని ‘పిల్లో జాబిల్లో..’, ‘ఘుం ఘుమాయించు కొంచెం..’, ‘చక్కిలి గింతల రాగం..’, ‘జపం జపం కొంగ జపం..’ అనే పాటలు బంపర్ హిట్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఈ పాటలనే వినేవారు. ఇక ఈ మూవీ తీసేందుకు అప్పట్లో రూ.3.50 కోట్లు ఖర్చు కాగా అంతకన్నా ఎక్కువగానే భారీ మొత్తంలో ఈ మూవీ కలెక్షన్స్ను వసూలు చేసింది.

ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ను ఎట్టకేలకు పూర్తి చేశారు. అడవుల్లో చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ కష్టపడి సినిమా తీశారు. 1990, జూలైలో ఆడియో విడుదల కాగా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 1990, ఆగస్టు 9వ తేదీన మూవీ విడుదలైంది. పాటలు, ఫైట్లు అద్భుతంగా కుదిరాయి. ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలవాల్సిన సినిమా సాధారణ హిట్ సినిమాగా నిలిచిపోవడం గమనార్హం. అప్పటికే విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి మేనియాలో ప్రేక్షకులు ఉండడం.. అదేవిధంగా ఈ కౌబాయ్ చిత్రం చిరంజీవి మాస్ సినిమాలకు భిన్నంగా ఉండడం.. ఒక సాధారణ హిట్ గా నిలిచిపోవడానికి కారణమైంది.

ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకోవడంతో చెన్నై లోని తాజ్ హోటల్లో “కొదమసింహం” శతదినోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. రజనీకాంత్ ఈ సినిమాను ఉద్దేశించి మాట్లాడుతూ.. కౌబాయ్ పాత్రలో చిరంజీవి బాగా నటించారు. నన్ను సూపర్ స్టార్ అని పిలుస్తారని కానీ నిజమైన సూపర్ స్టార్ చిరంజీవి అని చెప్పడంతో వేదిక మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది.































