భారతీయ రైళ్లలో టికెట్ కన్ఫర్మ్ కాకపోవడం చాలామందికి పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్ల గుండె అయితే రైలు బయలుదేరే వరకు దడదడలాడుతూనే ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఈ కంగారుని తగ్గించడానికి రైల్వే శాఖ ఒక సూపర్ ప్లాన్ వేసింది. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందే ఫైనల్ లిస్ట్ రెడీ చేసే ఆలోచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రీసెంట్గా బికనీర్ వెళ్లినప్పుడు ప్రయాణికుల కష్టాలను స్వయంగా చూశారట. అప్పుడు అక్కడి రైల్వే అధికారులు చివరి నిమిషంలో కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షన్ను తగ్గించడానికి ముందుగానే ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇప్పటివరకు రైలు బయలుదేరే 2-4 గంటల ముందు మాత్రమే ఫైనల్ చార్ట్ రెడీ చేసేవాళ్లు. దీనివల్ల వెయిటింగ్లో ఉన్నవాళ్లు ఎప్పుడు ప్రయాణం చేయగలరో, వేరే ప్లాన్స్ ఏమైనా చేసుకోవచ్చో తెలియక చాలా ఇబ్బంది పడేవాళ్లు.
అందుకే జూన్ 6 నుంచి బికనీర్ డివిజన్లో ఒక ప్రయోగం మొదలుపెట్టారు. రైలు బయలుదేరే ముందు రోజే, అంటే 24 గంటల ముందు ఫైనల్ చార్ట్ను రెడీ చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ప్రయోగం మొదట నాలుగు రోజుల్లోనే మంచి ఫలితాలు ఇచ్చింది. టికెట్ కన్ఫర్మ్ కానివాళ్లు ప్రయాణానికి వేరే దారులు చూసుకోవడానికి, ఇతర రైళ్లు లేదా బస్సుల్లో వెళ్లడానికి ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం దొరికింది.
ఈ ట్రయల్ సక్సెస్ కావడంతో రైల్వే శాఖ ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే రూట్లలో కూడా అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఇది అమలైతే రైలు ప్రయాణం మరింత సులువు అవుతుంది. ప్రయాణికులకు ముందుగానే సమాచారం తెలుస్తుంది, మంచిగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది.

































