కడప పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వేదికపై తన కోసం కుర్చీ వేయకపోవడంపై ఆమె అలకబూని, అరగంటకు పైగా నిలబడ్డారు. చివరకు అక్కడి నుంచి వెనుదిరిగారు.

డీసీ అతిథి సింగ్పై ఆగ్రహం
వేడుకల సందర్భంగా స్టేజిపై ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్తో పాటు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అతిథి సింగ్ ఆసీనులయ్యారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆలస్యంగా చేరుకున్నారు. వేదికపై తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, జేసీ అతిథి సింగ్పై చిందులు తొక్కారు. జేసీని ఆమె కోపంగా చూస్తూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.
ప్రోటోకాల్ ప్రకారం..
ప్రోటోకాల్ ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యేలకు వేదికపై అనుమతి లేదు. అయితే, జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్వయంగా ఎమ్మెల్యే మాధవి రెడ్డిని వేదికపైకి వచ్చి కూర్చోవాలని కోరారు. కానీ ఆమె ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తన కోసం కుర్చీ వేయకపోవడంపై నిరసనగా అరగంటకు పైగా అక్కడే నిలబడిన ఆమె, ఆ తర్వాత కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి వ్యవహరించిన తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



























