Telangana Government: తెలంగాణ సర్కార్ విద్యా వ్యవస్థకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని ప్రతీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండనున్నట్లు పేర్కొంది. దీంతో అన్నీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు.

2022-23 నుంచే ఈ విధానం అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. దీనిని అధికారికంగా సీఎం కేసీఆర్ నివాసంలో భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే మీటింగ్లో మన ఊరు మన బడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు.

అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాల కల్పనకు నిధులను కూడా విడుదల చేశారు. అందులో భాగంగానే రూ.7వేల 289కోట్లు వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సబ్ కమిటీకి ఆమోదం తెలిపింది కేబినెట్. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా.. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు..
అంతే కాకుండా.. ప్రైవేట్ పాఠశాల, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీల ఫీజులను సైతం రెగ్యూలర్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకురావాలని కేబినెట్ డిసైడ్ కాగా.. ఫీజుల నియంత్రణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన పలువురు మంత్రులతో సబ్ కమిటీని నియమించారు. దీనిలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావులు సభ్యులుగా ఉంటారు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాలేజీ యజమాన్యం నడుచుకోవాలని సూచించారు.






























