Telangana Politics : తెలంగాణలో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలు కాదు.. ప్రతిపక్షం వర్సెస్ ప్రధాన ప్రతిపక్షంగా పరిస్థితులు మారిపోయాయ్. ఎక్కడైనా అధికార పార్టీపై ప్రతిపక్షాలు పోరాడుతాయ్ కానీ.. ఇక్కడేంటో తమదే పైచేయి కావాలనుకుని వీళ్లు.. వీళ్లే తెగ కొట్టేసుకుంటున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పాలిటిక్స్ మారిపోయాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే..

తెలంగాణ ఇప్పుడంతా ప్రమాణాలు, సవాళ్లతో అట్టుడుకుతోంది. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి మరీ ప్రమాణం చేసి ఈటల విమర్శలకు సమాధానం ఇచ్చారు. ఈ తరుణంలో రేవంత్ కన్నీళ్లు పెట్టుకోవడం ఆ పార్టీ క్యాడర్కు కాస్త కలత కలగించే విషయం. ఆ తరువాత ఈటల సైలెంట్ అయిపోయారు. కానీ మధ్యలో కొందరు చేరి ఈ ఇష్యూని రంజాన్ పండుగ వేళ రాజకీయం చేయడమనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఈటల ఏమన్నారు? రేవంత్ ఎందుకు ప్రమాణం చేశారు? మధ్యలో రాజకీయమైన అంశమేంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈటలకు రేవంత్ సవాల్..
కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమంటే బీఆర్ఎస్కు ఓటేయడమేనని తద్వారా అధికారంలోకి వచ్చేది కేసీఆరేనని ఈటల తెలిపారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ నుంచి 25 కోట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందిచారు. వెంటనే ఈటలకు రేవంత్ ఒక సవాల్ విసిరారు. ప్రశ్నించే గొంతుకల మీద ఈటల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసుని.. తన రాజకీయ మనుగడ కోసం ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని రేవంత్ తెలిపారు. బీజేపీకి ఇష్టమైన భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర తడిబట్టలతో ప్రమాణం చేస్తారా? అని ఈటలకు ఛాలెంజ్ చేశారు. అంతేకాదు.. తాను భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి ప్రమాణం చేశారు.

మా విషయానికి వస్తే మాత్రం పండుగ అన్న విషయం గుర్తొచ్చిందా..?
ఈటల అంతటితో ఆగితే బాగానే ఉండేది కానీ రంజాన పండుగ రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయడమేంటంటూ కొత్త చర్చకు తెరదీశారు. ఇది మైనార్టీలను రెచ్చగొట్టడమేనని పలువురు అంటున్నారు. ఈ విషయంలో రేవంత్ ముందుగానే చెప్పారు.. బీజేపీకి ఇష్టమైన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తున్నానని. మరి వారికి నమ్మకమున్న చోటే కదా ప్రమాణం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాటిమాటికీ వెళ్లేది భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి. అలాగే బీజేపీ కీలక నేతలెవరు ఢిల్లీ నుంచి వచ్చినా భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని సందర్శిస్తుంటారు. కాబట్టి బీజేపీ వారు అంతగా నమ్మిన గుడిలోనే కదా ప్రమాణం చేయాలని రేవంత్ వర్గం అంటోంది. అలాగే వారాలు, వజ్రాలు, రోజులు, తిథులు, పండగలు చూసుకోకుండా విమర్శలు చేస్తారని.. తమ విషయానికి వస్తే మాత్రం పండుగ అన్న విషయం గుర్తొచ్చిందా? అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.

ఈటల రియాక్షన్ ఇలా..
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఈటల స్పందించారు. ‘రాజకీయంగానే నేను మాట్లాడా.. ఎవరినీ కించపర్చలేదు. నేను రేవంత్రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. పార్లమెంట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి. రేవంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా అసభ్యంగా మాట్లాడారు. రాజకీయ నేతలు కన్నీళ్లు పెట్టడం మంచిదికాదు. రేవంత్రెడ్డికి, నాకు పోలిక ఏంటి?. నేను విద్యార్థి నేతగా ఉన్నప్పటినుంచే పోరాటాలు చేస్తున్నా. నేను ప్రజల కోసం జైలుకేళ్తే.. నోటుకు ఓటు కేసులో రేవంత్ జైలుకెళ్లి వచ్చారు. రేవంత్రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడారు. నన్ను అడ్డుకున్నే దమ్ము రేవంత్కు లేదు. సైకో ఫ్యాన్స్తో ఫోన్ చేయించి తిట్టించే చిల్లర పనులు రేవంత్ మానుకోవాలి. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. రేవంత్కు పోరాడే దమ్ముందా?. భాగ్యలక్ష్మీ దేవాలయానికి పోలీసుల రేవంత్ను ర్యాలీతో తీసుకెళ్ళటం వెనుక మతలబు ఏంటో చెప్పాలి..?. పైసలిచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.. నేను అనలేదు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ దోస్తీని సహించలేకనే.. మర్రి, మహేశ్వరరెడ్డి లాంటి నేతలు బీజేపీలోకి వచ్చారు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ కోవర్టులున్నారని రేవంత్ రెడ్డి స్వయంగా అన్నారు. నాతో సహా.. 12మందిని ఓడించటానికి 2018లో కేసీఆర్ డబ్బులు పంపించాడు. రామగుండం, హుజూరాబాద్, ఎల్లారెడ్డి, పెద్దపల్లిలో సొంత అభ్యర్థులను ఓడించటానికి కేసీఆర్ డబ్బులు పంపాడు. హుజూరాబాద్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ డబ్బులు పంపారు’ అని ఈటల మరో సంచలనానికి తెరతీశారు.

వేడెక్కిన తెలంగాణ రాజకీయం..
ముఖ్యంగా బీజేపీ మత రాజకీయాలను నమ్ముకుని మనుగడ సాగిస్తున్న పార్టీ అని.. అందుకే పండుగ పూట కూడా మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి కూడా కల్పించుకుని ఒకరకంగా రేవంత్కే సపోర్ట్గా మాట్లాడారు. బీఆర్ఎస్తో పోరాడటం మానేసి ఇలా ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమేంటంటూ సర్దిచెప్పే యత్నం చేశారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని విజయశాంతి సూచించారు. మొత్తానికి రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ రాజకీయ సవాళ్లతో రంజాన్ పండుగ పూట తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే మాత్రం.. మీరు మీరు కొట్టుకు చావండి.. నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా ఉంది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ సైలెంట్గా గమనిస్తోంది.





























