Actor Naresh: సినీ కార్మికుల తమ వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ కార్మికులు తమకు వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ పై అధిక ఒత్తిడి తీసుకువస్తూ నేడు సమ్మెబాట పట్టారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనాలతో తమతో పని చేయించుకుంటున్నారని అందుకే వేతనాలు పెంచాలని సూచించినప్పటికీ ఫిలిం ఫెడరేషన్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు.

24 యూనియన్ల సభ్యులు ఈ విధంగా ఫిల్మ్ ఫెడరేషన్ పై ఆందోళనకు దిగడంతో సీనియర్ నటుడు నరేష్ ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో కార్మికులందరూ సమ్మె బాట పట్టడం సరైన నిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు.
నిన్నటి నుంచి ఎంతోమంది దర్శకనిర్మాతలు తనకి ఫోన్లు చేస్తున్నారని ఇలా కార్మికులందరూ సమ్మెబాట పట్టడంతో నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుందని, ఫైనాన్స్ వారికి వడ్డీలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళతారని నరేష్ వెల్లడించారు.అయితే గత మూడు సంవత్సరాలుగా కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు ఆగిపోతే ఎంతో మంది ఆర్టిస్టులు కడుపునిండా భోజనం చేయడానికి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు.వైద్య ఖర్చులకు సరిపడా డబ్బులు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన మరోసారి గుర్తు చేశారు.
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ ప్రాణం పోసుకుంటుంది..
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కరోనా నుంచి కోలుకొని ప్రాణం పోసుకుంటుంది. ఇలాంటి సమయంలో షూటింగ్లు బంద్ చేస్తే ప్రతి ఒక్కరికి నష్టమేనని తెలిపారు. ప్రస్తుతం మన అందరికీ బ్యాంకులు నిండక పోయినా మూడు పూటల కంచం నిండుతుందని ఇలాంటి పరిస్థితులలో సమ్మె చేయడం మంచిది కాదు అంటూ ఆయన పేర్కొన్నారు. వేతనాలు పెంచకపోతే షూటింగ్లు బంద్ చేయకుండా పెద్దలతో కలిసి పోరాటం చేయాలని ఆయన పేర్కొన్నారు.





























