దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. 2026 వేసవి ఉష్ణోగ్రతల పరంగా కొత్త రికార్డులు నమోదు కావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేవలం ఎండ తీవ్రతే కాదు, గాలిలో తేమతో కూడిన ఉక్కపోత కూడా ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మన శరీరం చెమట ద్వారా వేడిని బయటకు పంపి చల్లబడుతుంది. చెమట చర్మంపై ఆవిరిగా మారే ప్రక్రియ వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఈ విధానం సమర్థంగా పనిచేస్తుంది. కానీ తేమ అధికంగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఇప్పటికే నీటి ఆవిరితో నిండి ఉండటంతో చెమట సరిగా ఆవిరి కాలేదు. దీంతో శరీరం సహజంగా చల్లబడే ప్రక్రియ దెబ్బతింటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో గుండె వేగం పెరగడం, రక్తపోటు అధికం కావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తీవ్రమైన సందర్భాల్లో అవయవాలు సరిగా పనిచేయకపోవడం, ప్రాణాపాయం కూడా కలగొచ్చు. ఈ ప్రమాదాన్ని శాస్త్రవేత్తలు “వెట్-బల్బ్ టెంపరేచర్” (WBT) ద్వారా అంచనా వేస్తారు. ఇది గాలి ఉష్ణోగ్రతతో పాటు తేమను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
గతంలో మానవ శరీరం 35 డిగ్రీల సెల్సియస్ WBT వరకు తట్టుకోగలదని భావించేవారు. అయితే తాజా అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే, ఆరోగ్యంగా ఉన్న యువకులు కూడా సుమారు 31 డిగ్రీల WBT వద్దనే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోతున్నారు. ఉదాహరణకు, 38 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు 60 శాతం తేమ కలిసినప్పుడు ఈ ప్రమాద స్థాయి ఏర్పడుతుంది.
తీరప్రాంతాలు, రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే భారతదేశంలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి పొడి వడగాల్పుల గురించి అవగాహన ఉన్నా, తేమతో కూడిన వేడి ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇదే కారణంగా ఈ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు.
వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, మనం అనుభవించే వేడి కూడా మరింత తీవ్రంగా అనిపిస్తోంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా 50 డిగ్రీల మాదిరిగా అనిపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.
అందువల్ల వేసవిలో కేవలం ఉష్ణోగ్రతలకే కాకుండా, గాలిలో తేమ స్థాయిలపై కూడా దృష్టి పెట్టడం అవసరం. తగినంత నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం, శరీరాన్ని చల్లగా ఉంచే చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

































