కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్రరూపం దాల్చడంతో ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.కొన్ని ప్రాంతాలలో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు. అనవసరంగా బయట తిరగటం వల్ల వైరస్ వ్యాప్తి ఉదృతం అవుతుంది. కనుక అనవసరంగా ఎవరూ బయటకు రాకుండా అందరూ ఇంట్లోనే ఉండి మహమ్మారిని కట్టడి చేయాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

కరోనా ప్రభావం వల్ల ఇంట్లోనే కూర్చుని ఉంటే ఎంతో మందికి పూట గడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే ఉంటే కడుపు నిండక ఎంతోమంది పేదవారిలో ఆకలి చావు కేకలు వినిపిస్తాయని పలువురు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ మహిళ పేద వారి పట్ల తన మానవత్వం చాటుకుంది.కరోనా మహమ్మారి వల్ల బయటకు రాలేక తినడానికి తిండి లేక ఎంతో బాధపడుతున్న పేదవారికి ఉచితంగా బిర్యాని పంపిణీ చేస్తోంది.
ఈ విధంగా పేదవారికి ఉచితంగా బిర్యాని పంచుతూ పేద వారి పట్ల ఆమె చూపుతున్న మానవత్వాన్ని ఓ వ్యక్తి ఆమె ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఓ చెట్టుకింద చిన్న బండి పెట్టుకొని పేదలకు బిర్యానీ అందిస్తుంది. అదేవిధంగా ఆ బండి పక్కన ఒక బోర్డు కూడా పెట్టి ఉంది. అందులో “ఆకలిగా ఉందా? వచ్చి బిర్యాని తీసుకెళ్లండి”అంటూ రాసి ఉంది.
ఈవిధంగా పేదల పట్ల ఈమె చూపే అభిమానం చూస్తుంటే మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలి ఉందని ఆ వ్యక్తి ట్వీట్ చేయగా.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఏదిఏమైనా ఈ భయంకరమైన మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వీలైనంతవరకు అన్ని జాగ్రత్తలను పాటిస్తూ, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలని అధికారులు తెలియజేస్తున్నారు.



























