హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో వైసీపీ అసలు ముఖం మరోసారి బయటపడిందని, ముసుగు తొలగిపోయి లోపల దాగి ఉన్న కాషాయ కండువా బయటపడిందని ఆమె ఘాటుగా విమర్శించారు. వైసీపీ అసలు బీజేపీ బీ-టీమ్ అని ఇప్పుడు దేశానికి తేటతెల్లమైందని అన్నారు.

“మోదీకి జగన్ దత్తపుత్రుడే”
“మోదీకి జగన్ దత్తపుత్రుడేనని రాష్ట్ర ప్రజలకు ఈ మద్దతు కుండబద్దలు కొట్టినట్టే చూపించింది,” అని షర్మిల మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో మోదీ పక్షమే కొనసాగుతోందన్న వాస్తవం ఇప్పుడు మరింత స్పష్టమైందని ఆమె వ్యాఘ్యాణించారు. అవినీతి కేసుల భయంతో మళ్లీ బీజేపీకి దాసోహం అయ్యారని, ఐదు ఏళ్లు దోచుకున్నదాన్ని దాచుకోవడానికి మళ్లీ బీజేపీకి జైకొట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
రహస్య ఒప్పందాలపై షర్మిల విమర్శలు
చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురూ మోదీ తొత్తులేనని షర్మిల విమర్శించారు. వీరంతా బీజేపీకి ఊడిగం చేసే బానిసలేనని అన్నారు. టీడీపీ, జనసేనల పొత్తు తెరమీద జరిగిందని, కానీ వైసీపీది మాత్రం ఢిల్లీలో బీజేపీతో అక్రమ రహస్య ఒప్పందమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి పార్టీలతో కుస్తీ పడుతున్నట్టు నటిస్తూ, ఢిల్లీలో మాత్రం మతపిచ్చి బీజేపీతో చేతులు కలుపుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు.
తెలుగు ప్రజలకు ద్రోహం
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వైసీపీకి సిగ్గుచేటని షర్మిల అన్నారు. “దేశంలో ఓటు దొంగతనాలతో రాజ్యాంగం ఖూనీ అవుతున్నా, మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా వైసీపీ నోరు తెరపడం లేదు. దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని అభ్యర్థిగా నిలబెట్టాయి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ నిలబెట్టిన ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇస్తారా?” అని ప్రశ్నించారు. ఈ రాజకీయ ద్రోహంపై తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
YCP @YSRCParty ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది. బీజేపీకి @BJP4India బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగింది. మోడీ @narendramodi గారికి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి…
— YS Sharmila (@realyssharmila) August 22, 2025



































