తెలుగు సంప్రదాయాలను పాటించే మన భారతావనిలో పెళ్ళైన తరవాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఆనవాయతి. ఈ వ్రతాన్ని నూతన వధూవరులు శ్రద్ధగా ఆచరిస్తే వారి కాపురం పదికాలాల పాటు చక్కగా సాగుతుందని నమ్మకం. సాధారణంగా చాలా మంది నూతన వధూవరులు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ., అలా వీలు పడని పక్షంలో తమ ఇళ్లలోనే వ్రతం చేస్తుంటారు.

టాలీవుడ్ భల్లాలదేవ, దగ్గుబాటి వారి వారసుడైన రానా, మిహికా బజాజ్ ల పెళ్ళి ఆగస్టు 8న రామా నాయుడు స్టూడియోలో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో అన్నవరం వెళ్ళే వీలులేక ఆగస్ట్ 10వ తేదీన రానా ఇంట్లో నవ దంపతులతో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రానా ఇంట్లో జరిగిన ఈ పూజ కార్యక్రమాలకు దగ్గుబాటి వారి కుటుంబంతో పాటు టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య, సమంత దంపతులు కూడా సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. వీళ్ళందరూ పొందూరు చేనేత వస్త్రాలను ధరించి ఈ వ్రతంలో పాల్గొనడం విశేషమని చెప్పాలి.

రానా ఖద్దరు పంచె కట్టు, పైన కండువా వేసుకుని కనిపించారు. నవ వధువు మిహీకా ముదురు ఆకుపచ్చ, బంగారు వర్ణం చేనేత చీర, దానిపై ఎంబ్రాయిడరీ దుపట్టా ధరించారు. ముక్కు పుడక, పాపిట బొట్టు, నెక్లేస్, పెళ్లి గాజులు ధరించి వ్రతంలో పాల్గొన్నారు. లేత ఆకుపచ్చ రంగు చేనేత చీరలో సమంత మెరిసి పోయింది. ఖద్దరు షేర్వాణిలో నాగ చైతన్య హుందాగా కనిపించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రానా, మిహికాల పెళ్లి ముచ్చట్లు, ఇతరత్రా కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ సరదాగా గడిపారు. ప్రస్తుతం వీళ్ళందరూ కలసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.




























