1980 దశకంలో ఎంతోమంది ప్రముఖ నటులు సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ దశకంలో తెలుగు సినీ రంగంలోకి నాగార్జున, వెంకటేష్, సుమన్ లాంటి హీరోలతో పాటు రాజశేఖర్ కూడా తెరంగేట్రం చేశారు. టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వందేమాతరం మొదటి సినిమా కాగా అంకుశం లాంటి బ్లాక్ బస్టర్ తో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకొని ఆంధ్రదేశమంతటా అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకున్నాడు హీరో రాజశేఖర్.

వందేమాతరం, నవభారతం, రేపటి పౌరులు లాంటి అభ్యుదయ సామాజిక చైతన్యం తీసుకొచ్చే చిత్రాలను చేయడం వలన కావచ్చు రాజశేఖర్ కు స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయడానికి 1993 వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాన్స్ లు అంతంతమాత్రంగా చేసిన కూడా అల్లరి ప్రియుడుతో లవర్ బాయ్ గా కొత్త లుక్ లో కనిపించి ఒక విజయవంతమైన సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో యాంగ్రీ మెన్ పాత్రలే కాదు లవ్ రొమాంటిక్ సినిమాలను కూడా చేయగలరని రాజశేఖర్ నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన అన్న, మా ఆయన బంగారం, శివయ్య, మా అన్నయ్య లాంటి హిట్స్ తో 1990 దశకం విజయవంతంగా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ 2000ల దశకంలో యువ హీరోలతో పోటీపడుతూ తమ స్థానాలను సుస్థిర పరుచుకున్నారు. రాజశేఖర్ మాత్రం 2000 దశకంలో వరుస వైఫల్యాలతో పూర్తిగా చతికిల పడిపోయారు నష్టాలు ఫెయిల్యూర్స్ అంతకుమించి డిజాస్టర్స్ తో రాజశేఖర్ సినీ ప్రయాణం డక్క మొక్కీలు తింటూ చివరికి సొంత ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సొంత డబ్బింగ్ చెప్పుకోలేకపోవడం :

రాజశేఖర్ గ్రాఫ్ పడిపోవడానికి కారణాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే… రాజశేఖర్ ను మొదట తన సొంత గొంతుతోనే సంభాషణలు పలుకుతున్నారు అనుకున్న ప్రేక్షకులు ఆ గొంతు హీరో సాయికుమార్ దే అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దశాబ్దన్నర కాలం సాయికుమార్ గొంతుతో నెట్టుకొచ్చిన రాజశేఖర్ అతను తప్పుకోవడంతో ఇతర వాయిస్ లు (శ్రీనివాస మూర్తి ) రాజశేఖర్ కు అంతగా సూట్ కాలేదు.. ఒకనొక దశలో సాయికుమార్ డబ్బింగ్ చెబితేనే సినిమా చేస్తామని దర్శకనిర్మాతలు తెగేసి చెప్పయడంతో ఇది రాజశేఖర్ కి మరో మైనస్ గా మారింది.
హిట్స్ సినిమాలు వదులుకోవడం :

జెంటిల్మన్, సూర్యవంశం, ఠాగూర్ లాంటి మొదలగు సినిమాలను వదులుకోవడం రాజశేఖర్ కెరీర్ ని దెబ్బ తీసింది.. అంతేకాకుండా ట్రెండ్ కి తగ్గ కథలు ఎంచుకోకపోవడం, మూస కథలను నమ్ముకొని సినిమాలు తీయడం, ఆ సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడడం రాజశేఖర్ సినీ గ్రాఫ్ ని కిందికి పడేసింది..
ప్రాంతీయ భేదం :

ఇప్పటివరకు రాజశేఖర్ ను అందరు తెలుగు హీరోనే అని అనుకుంటూ ఉంటారు.. కానీ అతను తమిళ నటుడు అని ఎవరికీ తెలియదు.. ఈ విషయం తెలియడంతో తెలుగు ప్రేక్షకులు ప్రాంతీయ భేదాన్ని చూపించారు.. ఆయనకి ఉన్న చాలా అభిమాన సంఘాలు కూడా మూతపడిపోయాయి.. ఇది మరో కారణంగా పేర్కొనవచ్చు..
నట వారసుల ఎంట్రీ :

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి వారుసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం, వారి హవా ముందు రాజశేఖర్ నిలదొక్కుకోలేకపోయాడు.. ఎవడైతే నాకేంటి సినిమా తర్వాత రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డీలా పడిపోయింది..



























