“చిత్రం” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ అంటే అప్పట్లోని యూత్ జనరేషన్ కి ఓ ప్రభంజనం.. కన్నె పిల్లల కలల రాకుమారుడు.. నిర్మాతల పాలిట కల్ప తరువు. టీనేజ్ లోనే స్టార్ హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఉదయ్ చేతుల్లోంచి చాలా మంచి సినిమాలే చేజారి పోయాయి. నిజంగా ఆ చిత్రాలలో ఉదయ్ నటించి వుంటే.. ఉదయ్ కిరణ్ కోట్లకు పడగెత్తి వుండేవాడు. అగ్ర హీరోల స్ధాయిలో వుండి అందరి ప్రశంసలను అందుకునే వాడు. కానీ విధి వైపరీత్యమో.. లేక కావాలనే సినీ రాజకీయ కుటిల బుద్ధితో ఉదయ్ కిరణ్ ను ఆ చిత్రాలలో నటించకుండా చేశారో తెలియదు కానీ ఆ చిత్రాల వివరాలను ఒక్కసారి చదవండి..

ప్రేమంటే సులువు కాదురా

సంచలనమైన సినిమాలను నిర్మించడంలో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న ప్రముఖ సినీ నిర్మాత ఏ.ఎం.రత్నం “ఖుషీ” లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సూర్య మూవీస్ బ్యానర్పై ఉదయ్ కిరణ్ హీరోగా ప్రేమంటే సులువు కాదురా అనే సినిమా మొదలు పెట్టాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన 80 శాతం పూర్తైన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఆది శంకరాచార్య

ఉదయ్ కిరణ్ నటించాల్సిన భారీ బడ్జెట్ సినిమా ఆది శంకరాచార్య. ఈ చిత్రం కూడా అనుకోకుండా కొన్ని ఆవాంతరాలతో ఆగిపోయింది. ఈ సినిమాను మొదలుపెట్టే సమయానికీ ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడంతో చిత్ర నిర్మాత కూడా ఆర్థిక సమస్యలతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు.
అంజనా ప్రొడక్షన్స్ మూవీ

సక్సెస్ ఫుల్ హీరోగా ఉదయ్ కిరణ్ మంచి ఫామ్ లో వున్న టైంలో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అసిన్ జంటగా ఓ చిత్రం ప్లాన్ చేసారు. కానీ అనుకోని ఆవాంతరాలు ఎదురవడం వలన ఆ సినిమాను ఆపేశారు.
నర్తనశాల

నటసింహ నందమూరి బాలకృష్ణ సొంత డైరెక్షన్ లో భారీ తారాగణంతో నర్తనశాల సినిమాను లాంఛనంగా మొదలు పెట్టారు. అయితే ఆ చిత్రంలో ప్రధాన కధానాయిక సౌందర్య ఆకస్మికంగా మరణించడంతో ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ను అభిమన్యుడి పాత్ర కోసం ఎంపిక చేశారు బాలయ్య.
జబ్ వి మెట్ మూవీ (తెలుగు రీమేక్)

ఉదయ్ కిరణ్, త్రిష జంటగా అప్పటికే బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్టయిన జబ్ వి మెట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేశారు. కారణాలు వెలుగులోకి రాలేదు కానీ ఈ సినిమా కూడా ఆగిపోయింది.
సూపర్ గుడ్ ఫిల్మ్స్ మూవీ

తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ కూడా ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమాను ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత ఎందుకనో ఆ సినిమా పట్టాలెక్కలేదు.
చంద్రశేఖర్ యేలేటి మూవీ

టాలీవుడ్ లో విభిన్న కధాంశాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన డైనమిక్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అప్పట్లో ఉదయ్ కిరణ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసాడు. కానీ అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ను ప్రక్కన పెట్టేసాడు.
ఎమ్మెస్ రాజు మూవీ

ఉదయ్ కిరణ్తో అప్పటికే మనసంతా నువ్వే, నీ స్నేహం లాంటి ప్రేమకధా చిత్రాలను నిర్మించిన ఎమ్మెస్ రాజు ఆ తర్వాత కూడా ఉదయ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమా ఎందుకనో కార్యరూపం దాల్చలేదు.
ప్రత్యూష క్రియేషన్స్ మూవీ

ఉరకలేసే యువతరం గుండెల్లో గుబులు రేపేంతగా హీరో, హీరోయిన్లగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఉదయ్ కిరణ్, అంకితలు జంటగా ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్పై ఓ సినిమా ను మొదలు పెట్టారు. పూజ కూడా చేశారు. కానీ షూటింగ్ జరగకుండానే ఈ చిత్రం ఆగిపోయింది.
తేజ మూవీ

ఉదయ్ కిరణ్ను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు తేజ కూడా ఉదయ్ కిరణ్ కష్టాల్లో ఉన్నపుడు ఓ సినిమా చేద్దామనుకున్నాడు. చిత్రం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా సినిమాలతో సక్సెస్ కాంబినేషన్ గా యూత్ లో క్రేజ్ ను సంపాదించిన తేజ ఆ తర్వాత ఉదయ్ తో మరో సినిమా చేద్దామనుకున్నా సాధ్యపడలేదు.
అదండి సంగతి.. మొత్తానికి యూత్ స్టార్ ఉదయ్ కిరణ్ కెరీర్ లో పైన సూచించిన సినిమాలు ఆగిపోయాయి. ఒకవేళ నిజంగానే ఈ చిత్రాలలో ఉదయ్ హీరోగా నటించి వుంటే మనోడి కెరీర్ గ్రాఫ్ సక్సెస్ బాటలో దూసుకెళ్ళేదేమో.!



































