సినిమా ఇండస్ట్రీని ఒక మాయాలోకం తో పోల్చవచ్చు. ఎందుకంటే వెండితెరపై ఒక వెలుగు వెలిగిన నటీనటులు ఒక్క సారిగా కనిపించకుండా కనుమరుగవుతాయి. ప్రజలు నటీనటులను తమకు నచ్చినప్పుడు అభిమానిస్తారు నచ్చనప్పుడు పక్కన పడేస్తుంటారు.

ఇటువంటి వాటికి బాధితులైన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే సిని పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి ప్రజల్లో అభిమానాన్ని కలిగి ఉండి కూడా ఎవరికీ తెలియకుండానే కనుమరుగయిన వారు కూడా ఉన్నారు. ఈ విధంగా మంచి పేరు, ఎనలేని స్టార్ డమ్ సంపాదించిన సెలబ్రిటీలలో ఎవరెవరు కనుమరుగయ్యారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
వేణు తొట్టెంపూడి

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగిన వేణు తొట్టెంపూడి 1999వ సంవత్సరంలో స్వయంవరం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే పెళ్ళాం తో పనేంటి, ఖుషి కుషీగా చెప్పవే చిరుగాలి వంటి హిట్ చిత్రాల్లో నటించి చిన్న సైజు కామెడీ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. తదనంతరం ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 2009వ సంవత్సరంలో నువ్వెక్కడుంటే నేనక్కడుంటా అంటూ గోపి గోపిక గోదావరి చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు ఎవరికీ కనిపించకుండా పోయాడు తొట్టెంపూడి వేణు. హీరోగా నటించిన అతని చివరి సినిమా మాయగాడు కాగా… 2012లో దమ్ము సినిమాలో ఎన్టీఆర్ బంధువుగా కొంత సమయం పాటు కనిపించి తదనంతరం ఎవరికీ కనిపించకుండా కనుమరుగయ్యాడు.
తరుణ్

ఒకప్పుడు అమ్మాయిలకు ఫేవరెట్ హీరో గా నిలిచిన డ్రీమ్ బాయ్ తరుణ్ ప్రస్తుతం ఏ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపించడం లేదు. బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన తరుణ్ హీరోగా అవతారం ఎత్తి నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ స్క్రిప్టు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, దానికితోడు సినీ పరిశ్రమలో సరికొత్త కుర్రహీరోలు అరంగేట్రం చేయడం అతని సినిమా కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. సఖియా, సోగ్గాడు, ఒక ఊరిలో వంటి చిత్రాలు తరుణ్ సీనియర్ సినీ కెరీర్ గ్రాఫ్ ని అట్టడుగు స్థాయికి చేర్చాయి. భలేదొంగలు, శశిరేఖా పరిణయం వంటి చిత్రాలు కూడా తెలుగు సినిమా పరిశ్రమలో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి తరుణ్ కి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. 2 సంవత్సరాల క్రితం ఇది నా లవ్ స్టోరీ అనే పేరుతో తెరకెక్కిన ఒక సినిమాలో హీరోగా నటించాడు కానీ ప్రేక్షకులు ఆ సినిమా అస్సలు ఆదరించలేదు. దాంతో సినీపరిశ్రమకు దూరం అయిపోయాడు తరుణ్.
వడ్డే నవీన్

ప్రముఖ ఫిలిం ప్రొడ్యూసర్ వడ్డె రమేష్ కుమారుడైన వడ్డే నవీన్ పెళ్లి, ప్రియా ఓ ప్రియా, లవ్ స్టోరీ చాలా బాగుంది, నా ఊపిరి వంటి చిత్రాల్లో నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కన్యాదానం వంటి చిత్రంలో కూడా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. హీరోగా అతడు చివరిసారిగా నటించిన సినిమా శ్రీమతి కళ్యాణం. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు కానీ అకస్మాత్తుగా సినీ పరిశ్రమకు దూరం అయ్యాడు. ఆ సమయానికి ప్రజలు అతడిని ఆదరిస్తూనే ఉన్నారు, క్రేజ్ కూడా బాగానే ఉంది కానీ సినిమాలకు ఎందుకు దూరమయ్యారో ఎవరికీ అర్థం కాలేదు. వడ్డే నవీన్ చివరిసారిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఎటాక్ చిత్రంలో గోపి పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఏ సినిమాలో అతడు నటించలేదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు.
జై ఆకాష్

ఆనందం సినిమాలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల అలరించిన జైఆకాష్ ఆ తర్వాత పిలిస్తే పలుకుతా, నవవసంతం, ఆనందమానందమాయే, గురుదేవా వంటి చిత్రాల్లో హీరోగా నటించి సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అందాల రాముడు, గోరింటాకు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా నటించాడు కానీ కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీ నుండి దూరం అయ్యాడు. అతను చివరగా నటించిన చిత్రం ఆ… ఇద్దరు.
తారకరత్న

ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు వంటి ఎన్నో చిత్రాల్లో వరుసగా నటించి ప్రేక్షకాదరణ పొందాలేని ఏకైక నందమూరి వారసుడిగా మిగిలిపోయాడు తారకరత్న. 2009వ సంవత్సరంలో విడుదలైన అమరావతి సినిమాలో విలన్ గా నటించినందుకుగాను ఇతనికి నంది అవార్డు కూడా లభించింది. 2017 వరకు విక్రమార్కుడు వలె ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు పట్టు వదలకుండా చాలా సినిమాల్లో హీరోగా నటించాడు తారకరత్న. కానీ ప్రేక్షకులు మాత్రం అతడిలో హీరో మెటీరియల్ చూడలేకపోయారు. దీంతో వెండితెరకు పూర్తిగా దూరమయ్యాడు తారకరత్న.
రాజా

ఓ చిన్నదాన, ఆనంద్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రాజా అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించి అనేక చిత్రాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత ఆ నలుగురు, అర్జున్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా కనుమరుగయ్యాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే నవ వసంతం సినిమాలో లో నటించిన రోహిత్ రెడ్డి, హ్యాపీ డేస్ లో నటించిన రాహుల్ లాంటి ఎంతో మంది నటులు వెండితెరపై తళుక్కుమని మెరిసి ఎవరికీ కనిపించకుండా కనుమరుగయ్యారు. నటులు మాత్రమే కాదు నటీమణులు కూడా ప్రేక్షకులను బాగా అలరించి ఆ తర్వాత ఎక్కడా కూడా కనిపించకుండా కనుమరుగయ్యారు. ఉదాహరణకి స్నేహఉల్లాల్, దీక్షాసేత్, భానుశ్రీ మెహ్రా, పాయల్ గోయల్ వంటి హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించి వెండితెర కి పూర్తిగా దూరమయ్యారు.



























