వెండితెర అందగాడు, అమ్మాయిల కలల రాకుమారుడు సోగ్గాడు శోభన్ బాబు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు గా ఆయన సినిమాల్లో పోషించిన పాత్రలకు అప్పట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కటిక పేదరికం నుండి టాలీవుడ్ అగ్ర హీరోగా ఎదిగిన శోభన్ బాబు నటించి సంపాదించిన ప్రతి పైసా కూడబెట్టి కోట్లాధిపతి అయ్యారు. అయితే సినీ రంగంలో ఒకప్పుడు యువతులను ఉర్రూతలూగించిన ఆంధ్రుల అందగాడు తన జీవితంలోని చివరి రోజుల్లో ఒంటరిగా ఫీల్ అవుతూ చాలా దయనీయంగా జీవితాన్ని గడిపారట. సినీ పరిశ్రమలో తనకు బాగా పరిచయమైన వ్యక్తులతో కూడా కలిసే మాట్లాడేందుకు అతను ఇష్టపడలేదట. తాను సంపాదించిన ఆస్తులన్నీ కూడా చెన్నై మహానగరంలోనే ఉండటంతో… తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు నగరానికి మకాం మార్చినా ఆయన రాలేకపోయారు.

1996 సంవత్సరంలో చిత్రసీమకు గుడ్ బై చెప్పిన సోగ్గాడు శోభన్ బాబుకు ఒక కుమారుడు ముగ్గురు కూతుళ్లు ఉండటంతో… తన ముగ్గురు కూతుర్లకు అప్పట్లోనే అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే తన కూతురిపై ఎక్కువ ఇష్టం ఉండటంతో వాళ్లందరికీ తన ఇంటికి దగ్గరలోనే కొత్త ఇల్లులు కొని ఇచ్చారు. దీంతో పెళ్లి అయినప్పటికీ తన తండ్రికి దగ్గరలోనే ఉండగలిగారు శోభన్ బాబు కూతుర్లు. అయితే శోభన్ బాబు వయసు పైబడిన తర్వాత ఆయన తన కుమారుడికి తన వ్యాపారాలన్నీ అప్పగించేశారు. కొంతకాలం వరకు కూతుళ్లు అల్లుళ్లు కుమారులు మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా సమయం గడపగలిగారు. అయితే సినీ రంగంతో తాను ఏర్పరుచుకున్న బంధం ఒకేసారి తెగిపోవడంతో మనసులో ఏదో ఒక ఒంటరి భావన అతనిలో తీవ్రంగా కలిగింది. రోజులు గడుస్తున్న కొద్దీ సినిమా పరిశ్రమని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ అతని మనసులో విపరీతంగా పెరిగిపోయింది.

సినిమా పరిశ్రమకి గుడ్ బై చెప్పిన మొదటి రోజుల్లో శోభన్ బాబు మంచిగా బట్టలు వేసుకుని కారు లో తిరుగుతూ తన వ్యాపారాలను ఎంచక్కా చూసుకునేవారు. కానీ కొన్నాళ్ళకు అతని మొహం పై వృద్ధాప్య ఛాయలు ఏర్పడడంతో ఆ నిజాన్ని తట్టుకోలేక పోయాడు. ఎప్పుడూ అందంగా కనిపించాలనుకున్న శోభన్ బాబు ఒకేసారి ముసలివాడిని అయిపోయాను అన్న భావన అతనిలో ఇంకా బాధ కలిగించింది. 70 ఏళ్ళ వయసులో కూడా అతను అందంగానే యవ్వనంగా కనిపించాలనుకున్నారు శోభన్ బాబు. కానీ అందంగా ఉండాలి అనుకున్న తన తపన నెరవేరకపోయేసరికి ఇంకా కృంగిపోయారు. కూతుళ్లు అడపాదడపా ఇంటికి వస్తున్నా మనవళ్లు మనవరాళ్లు అతనితో ముద్దు ముద్దు ముచ్చట్లు పెడుతున్నా శోభన్ బాబు ఒంటరిగా ఫీల్ అయ్యారు. అతనికి ఎటువంటి శారీరక అనారోగ్యం లేకపోయినప్పటికీ అతని ఆలోచనలు మానసికంగా అతనిని ఆరోగ్యాన్ని మానసికంగా క్షీణింపజేసాయి.

అయితే చివరి రోజుల్లో మానసికంగా ఒంటరిగా ఉండిపోయిన శోభన్ బాబు తన జీవితంలో డబ్బు కూడబెట్టానని కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయలేదని మదన పడేవారు. ఆ క్రమంలోనే అతని చెల్లెలు ఝాన్సీ చనిపోవడంతో… తనకంటే చిన్నదైన సోదరి మణి చనిపోయిందని అతనిలో బాధ ఎక్కువయ్యింది. దీంతో శోభన్ బాబు మానసిక పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. 2008 మార్చి 20న తన కుమారుడితో ఫోన్లో మాట్లాడుతూ వ్యాపార విషయాల గురించి కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి కుర్చీలోంచి పైకి లేస్తున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే అతను నేలపై పడిపోయారు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది.



























