సినీ సంగీత సామ్రాజ్యాన్ని ద్విచక్రాదిపత్యంగా ఏలుతున్న చక్రవర్తి ఇళయరాజాల సమయంలో అంకురించిన “శిష్యద్వయం” రాజ్ కోటి. చక్రవర్తి సంగీత స్వర్గధామం లో రాజ్ కోటి లు అసిస్టెంట్స్ గా చేరి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఈ శిష్య ద్వయం లో ఒకరైన రాజ్(సోమరాజు) ప్రముఖ సంగీత దర్శకుడు టి.వి.రాజ్ కుమారుడు. మరొకరైనా కోటి (కోటేశ్వరరావు) ఆనాటి సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు. ఇద్దరు సోదరులు కానప్పటికీ బాల్యం నుంచే మంచి స్నేహితులుగా ఎదిగారు. చక్రవర్తి గారి వద్ద గిటారిస్ట్ గా ఇద్దరూ మెళుకువలు నేర్చుకున్నారు. ఆ క్రమంలో ఈ శిష్యద్వయము లో ఒకరైనా రాజుకి ఓ సినిమా అవకాశం తలుపు తట్టింది. ఆ విషయాన్ని కోటితో చెప్పగా ఇద్దరూ సమాలోచన జరిపి చివరికి ఒక సంగీత ద్వయం గా ఏర్పడి సినిమాలు చేద్దామని నిర్ణయానికి వచ్చారు. అలా వారు 1983 లో ప్రళయ గర్జన అనే సినిమాతో సంగీత దర్శకులుగా పరిచయమయ్యారు.

1988 వచ్చేసరికి యముడికి మొగుడు తో యాక్షన్ హీరో చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. అదే సంవత్సరంలో చిరంజీవి తో చేసిన ఖైదీ నెంబర్ 786 లోని “గువ్వా గోరింకతో….” అనే పాట యువత గుండెల్లో మారుమ్రోగింది. చిరంజీవి డాన్స్ మూమెంట్స్ టెంపో ని దృష్టిలో ఉంచుకొని అప్పటి వరకు రాని ఒక రకమైన కంపోజింగ్ తో ఆ పాట చేయడం వలన ఒక్కసారి సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆ దశలో రాజ్ కోటిల పేరు తెలుగు సినీ పరిశ్రమలో పీక్ స్థాయిలో కి వెళ్ళింది.

ఈ తరహా విజయాలతో దూసుకెళ్తున్న రాజ్ కోటి ద్వయానికి మరెన్నో అవకాశాలు వారిని వెతుక్కుంటూ వచ్చాయి. అలా అనేక మంది టాప్ స్టార్స్ కి సంగీతం అందించారు. ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఏ.ఆర్.రెహమాన్ వీరి దగ్గరే కీబోర్డ్ ప్లేయర్ గా పని చేయడం జరిగింది. వీరి అనేక చిత్రాలకు అవార్డులు, రివార్డులు రావడం జరిగింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు సంబంధించిన వారు చెప్పిన మాటల ద్వారా రాజ్ కోటి మధ్య విభేదాలు వచ్చి 1995 వరకు కొనసాగి ఆ తర్వాత విడిగా సినిమాలు చేసుకోవడం ప్రారంభించారు. కోటి కొంత మేరకు సినిమాలతో తన ఉనికిని కాపాడుకున్నప్పటికి రాజ్ మాత్రం సినిమాలు తగ్గుముఖం పట్టడంతో తన ఉనికిని కోల్పోయారనే చెప్పొచ్చు.































