Vijayashanti : టి.కృష్ణ సినీ పరిశ్రమలో కొనసాగుతూ దర్శకత్వం చేయాలని ఆలోచనతో అనేక సంప్రదింపులు జరపడాన్ని పోకూరి బాబురావు గమనించారు. ఒకరిని అవకాశము అడిగేది ఏమిటి? మనమే సినిమా నిర్మిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో భాగంగా ఆయన ఈ తరం ఫిలిమ్స్ అనే బ్యానర్ ని స్థాపించారు. అలా టి.కృష్ణ, బాబురావు కలిసి ఒక సినిమా తీయాలని కొంత విప్లవాత్మకంగా, సామాజిక స్పృహతో కూడిన కథను దర్శకడు టీ.కృష్ణ తయారు చేసుకున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ఓ మహిళ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా తయారు కాబడిన కథకు హీరోయిన్ ఎవరైతే బాగుంటుందనే ఆలోచన చేస్తున్న క్రమంలో.. ఒకసారి పోకూరి బాపూరావు నటిస్తున్న ‘నవోదయం’ చిత్ర షూటింగ్ కి టి.కృష్ణ వెళ్లారు. అక్కడ ముచ్చాల అరుణ, విజయశాంతి కలిసి నటిస్తున్న సీన్ గమనించిన దర్శకుడు టీ.కృష్ణ తన సినిమాలో హీరోయిన్ గా విజయశాంతి అయితే బాగుంటుందనుకున్నారు.

ఆ క్రమంలో వారు విజయశాంతిని అప్రోచ్ అవ్వగా వారి తండ్రిగారు ముందుగా ‘నేటి భారతం’ సినిమాలో చేయడానికి ఈతరం ఫిలింస్ వారికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం విజయశాంతి టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో మొదటగా నేటి భారతం చిత్రంలో నటించారు.ఆ తర్వాత దాదాపుగా ఆయన ప్రతి సినిమాలో ఆమె నటిస్తూ అద్భుత విజయాలను సాధించారు. ఇకపోతే 1986లో ఈతరం ఫిలిమ్స్, పోకూరి వెంకటేశ్వర్రావు నిర్మాణం, టి.కృష్ణ దర్శకత్వంలో ‘రేపటిపౌరులు’ చిత్రం విడుదల అయింది.ఈ సినిమాలో విజయశాంతి,రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడారు.

1980 దశకంలో దర్శకుడు టి.కృష్ణ మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు, అలాగే మీ బాండింగ్ గురించి చెప్పండని యాంకర్ అడగగా.. దర్శకుడు టి.కృష్ణ మరియు నాది అన్నాచెల్లెళ్లతో కూడిన బాండింగ్. అయన దర్శకత్వం చేసిన ప్రతి సినిమాలో దాదాపుగా నేను హీరోయిన్ గా నటించాను. 1986లో వచ్చిన రేపటి పౌరులు చిత్రంలో ఒక గ్రామ దేవాలయం వద్ద ప్రజాకోర్టు పెడతారు. అప్పుడు నన్ను దర్శకుడు టి.కృష్ణ ఒక లెంతీ డైలాగుతో కూడిన సీన్ లో నటించమన్నారు. నేను ఆ సీన్ జనం మధ్యలో డైలాగ్ చెబుతూ నటించాను. ఆయన పాపం క్యాన్సర్ తో బాధపడుతూ బెడ్ పైనుంచి డైరెక్షన్ చేశారు. ఎందుకో ఆ సీన్ లో నేను చేసింది ఆయనకు నచ్చలేదు. ఆవేశంగా చేతులు పైకి కదుపుతూ.. బిగ్గరగా సంభాషణలు చెప్పాలంటూ ఆయన నాకు చెప్పారు. తిరిగి పది నిమిషాల సమయం తీసుకుని కెమెరా స్టార్ట్ అనగానే సింగిల్ టేక్ లో మొత్తం చెప్పేసాను.అప్పుడు దర్శకుడు టి.కృష్ణ..శాంతమ్మ ఇప్పుడు బాగా చెప్పారంటూ మెచ్చుకున్నారు.

ఆ తర్వాత ఊటీలో నేను శోభన్ బాబు హీరో హీరోయిన్ గా కళ్యాణ తాంబూలం చిత్రంలో నటిస్తున్నప్పుడు.. టి కృష్ణ మరణ వార్త విని నేను చాలా బాధపడ్డాను. ఇంతకుముందే ఆయన అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. తిరిగి చెన్నైలో ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆ విరామ సమయంలోనే రేపటి పౌరుల చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. సడన్ గా అలా జరగడం బాధగా అనిపించింది. అయితే వెంటనే షూటింగ్ వాయిదా వేసుకుని.. ట్రైన్ లో ఊటీ నుంచి నేను వచ్చేసరికి.. టి.కృష్ణ గారి దహన సంస్కారాలు అప్పటికే పూర్తయిపోయాయి. ఆ సమయంలో గోపీచంద్, వాల్ల అన్నయ్య ప్రేమ్ చంద్ ఇద్దరు చిన్నపిల్లలు ఆ పిల్లల్ని చూస్తే చాలా బాధనిపించింది. చిన్న వయసులోనే టి.కృష్ణ(36) మరణించడం ఆయన కుటుంబంలోనే కాదు సినీ పరిశ్రమలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయని విజయశాంతి చెప్పుకొచ్చారు.
































