అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండేళ్లుగా తమ కుమార్తెను చూడలేక, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేకపోయిన తల్లిదండ్రులు, అల్లుడి ఫోన్ కాల్ తో రాజమహేంద్రవరం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఎముకల గూడులా మారిన తమ కుమార్తె లక్ష్మీప్రసన్న (33) మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె శరీరంపై ఉన్న గాయాలను చూసి షాక్ కు గురయ్యారు.

కట్నం వేధింపులే కారణమా?
మృతురాలు లక్ష్మీప్రసన్న ఖమ్మం జిల్లాకు చెందినది. 2015లో ఆమెకు కల్లూరు మండలం, ఖాన్ఖాన్పేట గ్రామానికి చెందిన పూల నరేశ్బాబుతో వివాహం జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది. కొంతకాలం ఖాన్ఖాన్పేటలో నివసించిన ఈ దంపతులు, ఆ తర్వాత అశ్వారావుపేటకు మకాం మార్చారు. తమ కుమార్తె మరణానికి భర్త నరేశ్బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క భూలక్ష్మి, బావ శ్రీనివాసరావే కారణమని మృతురాలి తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
“ఆహారం లేకుండా చంపేశారు” – తల్లిదండ్రుల ఆవేదన
వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో పాటు, భూమిని కూడా కట్నంగా ఇచ్చామని లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు తెలిపారు. అయితే, అదనపు కట్నం కోసం నరేశ్ బాబు కుటుంబం తరచూ లక్ష్మీప్రసన్నను హింసించేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా తమ కుమార్తెను ఫోన్ లో మాట్లాడనివ్వలేదని, తాము ఇంటికి వెళ్లినప్పుడు కూడా “అతను ఇంట్లో లేడు” అని చెప్పి పంపించేవారని వాపోయారు. వారి ఆరోపణల ప్రకారం, లక్ష్మీప్రసన్నను గృహ నిర్బంధంలో ఉంచి, ఆహారం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసి హతమార్చారని చెబుతున్నారు. అయితే, నరేశ్బాబు బంధువులు మాత్రం లక్ష్మీప్రసన్న రక్తహీనత, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుందని, వారి ఆరోపణల్లో నిజం లేదని వాదించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అశ్వారావుపేట ఎస్సై యయాతిరాజు తెలిపారు.































