Yandamuri Veerendranath : నవలా రచయితగా సుపరిచితులైన యండమూరి సినిమా రంగంలో కూడా పనిచేసారు. ఆయన రాసిన అనేక నవలలు సినిమాలుగా వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించాయి. తెలుగులో పలు సినిమాలు, సీరియల్స్ కు కథ అందించిన యండమూరి గారు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఇక కన్నడ లో కూడా కొన్ని సినిమాలకు కథలు అందించారు. ఆయన చిరంజీవి కాంబినేషన్ లో అభిలాష, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఛాలెంజ్ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి.

చిరంజీవికి ఆ కథ సరిపోదని అవమానించారు..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో యండమూరి గారు ఒక సినిమా కథ విషయంలో జరిగిన సంఘటన వివరించారు. యండమూరి గారు ఏ కథ రాసినా అది చిరంజీవిగారిని దృష్టిలో పెట్టుకుని రాసేవారట. అలానే ఒక కథ కోదండ రామిరెడ్డి అడిగితే చిరంజీవి కాంబినేషన్ లో సినిమా కోసం ఆయన సిద్ధం చేశారట. మరి కొద్దిరోజుల్లో సినిమా ముహూర్తం అనుకునే సమయానికి, ఏమి చెప్పకుండా కోదండ రామి రెడ్డి గారు గొల్లపూడి మారుతీ రావు గారి కథతో సినిమా చేస్తున్నట్లు పత్రికలో రావడం చూసి బాగా బాధపడ్డారట. అదే సమయానికి అశ్వినిదత్ వచ్చి కథ అడుగగా చిరాకుగా ఉన్నానని కోదండ రామి రెడ్డి ఒక మాటైనా చెప్పకుండా వేరే సినిమా చేస్తున్నారు అని అన్నారట. ఏడేళ్ల నుండి ప్రయాణిస్తున్నాం ఇద్దరూ ఇలా చెప్పకుండా చేస్తారా మరి ఇంత కమర్షియల్ గానా అని చిరాకుపడ్డారట యండమూరి.

ఇక వెంటనే ఆ కథను అశ్విని దత్ కు చూపించగా, ఆయన కూడా ఈ కథ చిరంజీవికి సరిపోదు కదా అన్నారట. పక్కనే అన్నపూర్ణ స్టూడియోలో రాఘవేంద్ర రావు ఉండగా ఆయనను కలిసి కథ చూపించగా ఆయన కూడా అదే మాట అన్నారట. ఈ కథలో హీరోకి పెద్దగా ఇమేజ్ లేదు ఈ కథ చిరంజీవికి నప్పదు అని చెప్పారట. అయితే కథ బాగా నచ్చింది ఒక కొత్త కుర్రాడితో సినిమాలు చేద్దాం అని అన్నారట. ఎవరితో అన్నపుడు నాగార్జున అయితే బాగుంటుందని అనుకున్నారు. ఇక హీరోయిన్ పాత్ర చాలా కీలకం సిబిఐ ఆఫీసర్ గా ఉండే పవర్ ఫుల్ పాత్రకి ఎవరైతే బాగుంటుందని అలోచించి శ్రీదేవిని తీసుకుందామనుకున్నారట. నాగేశ్వరావు గారితో చేసింది మళ్ళీ నాగార్జున తో ఎలా అని సంశయించినా, శ్రీదేవి అయితే ఆ పవర్ ఫుల్ రోల్ కి బాగుంటుందని ఎంపిక చేసారు. ఇక కథలో చిన్న మార్పులు చేసి సుహాసిని పాత్రను పెట్టారట. అలా చిరంజీవి కోసం రాసిన కథ నాగార్జున తీసిన ‘ఆఖరి పోరాటం’ సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆతరువాత రాఘవేంద్ర రావు తో కూడా కొన్ని సినిమాలు చేశారట యండమూరి.



























