వైసీపీ, టీడీపీ మధ్య గొడవలోకి అనూహ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చి చిక్కుకున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా రజినీ చుట్టూనే తిరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో సడెన్గా ఏపీ పాలిటిక్స్లోకి సీనియర్ నటుడు మంచు మోహన్బాబు ఎంట్రీ ఇచ్చారు. ఒకసారి ‘ఖుషి’ సినిమాను తీసుకుందాం.. హడావుడిగా.. ట్రాఫిక్ను పట్టించుకోకుండా రోడ్డుపైకి వచ్చేసి.. సినిమాను మొత్తం మలుపు తిప్పేసి వెళ్లిపోతుంది ఒక క్యారెక్టర్. ఇప్పుడు మోహన్బాబు క్యారెక్టర్ కూడా అంతే అయ్యేలా ఉంది. అటు తిరిగి.. ఇటు తిరిగి టాపిక్ మనవైపు టర్న్ అయ్యిందే.. అని ఓ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటారు. ఇప్పుడు ఏపీ పొలిటిక్స్లోనూ అదే జరుగుతోంది. వైసీపీ – రజినీకాంత్ – టీడీపీ మధ్య జరుగుతున్న వార్లోకి మౌనంగా ఉన్న మంచు మోహన్బాబును సైతం లాగేశారు. అసలు ఈ ఇష్యూతో ఏ సంబంధమూ లేని మోహన్ బాబు.. మధ్యలోకి ఎందుకు వచ్చారు? ఆయన మౌనంపై ఇన్ని విమర్శలు ఎందుకు? తదితర విషయాలన్నీ ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

మైక్రోస్కోప్ పెట్టి మరీ వెదుకుతున్నారు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రజనీకాంత్ ప్రస్తుతం కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు వచ్చి ఆయన అడ్డంగా బుక్ అయ్యారు. ఏదో ఎన్టీఆర్ గురించి నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోతే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదేమో కానీ చంద్రబాబు గురించి మాట్లాడటంతో అసలు చిక్కు వచ్చిపడింది. ఇది వైసీపీ నేతలకు రుచించలేదు. దీంతో మైక్రోస్కోప్ పెట్టి మరీ ఆయనకు సంబంధించిన ఏవైనా విషయాలు దొరుకుతాయేమోనని సెర్చ్ చేస్తున్నారు. ఏమీ దొరక్కున్నా కూడా ఏదో ఒక ఇష్యూతో ఆయనకు లింక్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే కొన్ని అడుగులు ముందుకు వేసి మరీ వ్యక్తిత్వ హననం చేశారు. ఇది చాలదన్నట్టు సిల్క్ స్మిత లేఖ పేరుతో ఓ లేఖను వెలుగులోకి తెచ్చి ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్ చేశారు. మరి రజినీకాంత్ వ్యక్తిత్వ హననం అనేది ఈ స్థాయిలో జరుగుతుంటే ఆయన ప్రియ స్నేహితుడు మోహన్ బాబు ఎందుకు మౌనంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ క్వశ్చన్.

కనీసం సాటి నటుడుగానైనా స్పందించవచ్చు కదా..
మోహన్బాబు సైలెంట్గా ఉండటం కూడా సమస్య అవుతోంది. అవసరం ఉన్నా లేకున్నా రజినీకాంత్ తన కుటుంబానికి ఎంత దగ్గరో.. తనకు ఎంత గొప్ప స్నేహితుడో చెప్పే మోహన్ బాబు సొంత రాష్ట్రంలో ఆయనకు అంత అవమానం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోయారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. టీడీపీ నుంచి గత ఎన్నికల సమయంలో మోహన్బాబు వైసీపీకి టర్న్ అయ్యారు. కానీ అక్కడ కూడా ఆయన యాక్టివ్గా లేరు. తన విద్యా సంస్థల విషయంలో సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తితోనో లేదంటే మరో కారణంగానో కానీ ఆయన యాక్టివ్గా లేరు. మిగిలిన సందర్భాల్లో అయితే ఏమో కానీ.. రజినీకాంత్కు ఘోర అవమానం జరుగుతున్న ఈ తరుణంలో మోహన్ బాబు నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకుడిగా కాకున్నా కనీసం సాటి నటుడిగానైనా స్పందించవచ్చు కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరకు అంత పెద్ద స్టార్ హీరో రూపం నుంచి ఆకారం, ఆహార్యం, ఆరోగ్యం వరకూ దారుణమైన ఆరోపణలు చేసినా కూడా స్పందించకపోవడం పట్ల విస్మయం కలుగుతోంది.

అడకత్తెరలో పోకచక్కలా..
నిజానికి ఈ వ్యవహారంలో అడకత్తెరలో పోకచక్కలా తయారైంది మోహన్బాబు పరిస్థితి. కరవమంటే కప్పకు.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉండటంతో మోహన్బాబు సైలెంట్ అయిపోయారు. రజినీ కాంత్ను అలా అంటున్నారేంటంటూ ఒక్క ముక్క మాట్లాడినా కూడా మోహన్బాబుపై ట్రోల్స్ బీభత్సంగా వచ్చేస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకరకంగా వైసీపీకి భయపడిపోయి సైలెంట్గా ఉండిపోయారు. ఒకవేళ తాను మాట్లాడితే రజినీ సైడ్ అయపోయి తనను దారుణంగా ట్రోల్ చేస్తారని మోహన్బాబు భయపడుతున్నారని సమాచారం. పోనీ అలాగేమైనా ఊరుకున్నారా? అంటే స్నేహితుడికి అంత అవమానం జరుగుతున్నా మాట్లాడటం లేదంటూ టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి రజినీని అంత ఘోరంగా అవమానిస్తుంటే సినీ ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ అవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదే విషయంపై ఆయన అభిమానులు సైతం మండిపడుతున్నారు. కనీసం ఈ విషయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా కల్పించుకోకపోవడమేంటని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మోహన్బాబు రజినీకి కాల్ చేసి మాట్లాడారని టాక్. కానీ బహిరంగంగా మాత్రం ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు.. ఏదేమైనా వైసీపీ బ్యాచ్ కి దొరకకూడదని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారన్న మాట.





























