పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్లలో చోటుచేసుకున్న విషాదకర ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన రెంటపాళ్ల గ్రామానికి వెళ్లి, గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, స్థానిక మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ‘‘కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, నాగమల్లేశ్వరరావును ఊరు విడిచిపోవాలని పోలీసులు బెదిరించారు. అంతేకాదు, రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఈ ఒత్తిడికి లోనై ఆయన తీవ్ర మానసిక బాధకు గురయ్యారు. గుంటూరులోని సోదరుడి ఇంటికి వెళ్లి తండ్రికి ఫోన్ చేసి తన బాధ చెప్పుకున్నారు. చివరికి పోలీసుల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి ఎంతగా ప్రయత్నించినా ఆయన్ని కాపాడలేకపోయారు’’ అన్నారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు ఎవరిపైనూ చర్యలు తీసుకోకపోవడాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ పూర్తిగా కూటమి శక్తులకు అనుకూలంగా మారిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనే నిజానికి ఇది ఒక ఉదాహరణ. రెంటపాళ్ల ఘటన రాష్ట్రంలో ఉన్న భయానక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నాగమల్లేశ్వరరావు భార్య, కుమార్తె న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారి కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు’’ అని విమర్శించారు.
ఇక అదే నియోజకవర్గానికి చెందిన మరో యువకుడు లక్ష్మీనారాయణ కూడా పోలీసుల వేధింపులను భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జగన్ తెలిపారు. ‘‘ఇలాంటి దౌర్జన్యాలను అరికట్టేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి రావాలి’’ అని పిలుపునిచ్చారు.



































