దేశ స్వాతంత్రాన్ని కంటే ముందే అక్కినేని నాగేశ్వరరావు సినీరంగ ప్రవేశం చేశారు. ఆ క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సినిమారంగంలో నిలదొక్కుకున్నారు. నటన, సినిమాఎంపికలో తనదైన ముద్రవేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆయన చిత్రాలు ఉండేవి. దగ్గుబాటి రామానాయుడు తన సొంత గ్రామము కారంచేడులో అక్కినేని హీరోగా “నమ్మినబంటు” సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమాల్లోకి రమ్మని అక్కినేని డి.రామానాయుడును ఆహ్వానించారు. తన వ్యాపారాలకు స్వస్తి చెప్పి ఆయన 1963లో సినీ రంగంలో ప్రవేశించినప్పటికీ 1964లో తన పెద్ద కుమారుడైన సురేష్ బాబు పేరు మీదుగా సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించడం జరిగింది.

“రాముడు భీముడు”తో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పట్టాలెక్కింది. ఆ తర్వాత “సిపాయి చిన్నయ్య” అనే చిత్రంతో అక్కినేని, రామానాయుడు కాంబినేషన్ మొదలయ్యింది. అలా డి.రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ లో తొమ్మిదో సినిమాగా “ప్రేమ్ నగర్” అనే బ్లాక్ బస్టర్ సినిమా రూపొందించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం మరింత బలపడింది.

కొన్ని సంవత్సరాలకు ఈ స్నేహం కాస్త బంధుత్వంగా మారింది. అక్కినేని, రామానాయుడు ఇద్దరూ వియ్యంకులుగా మారిపోయారు. డి.రామానాయుడు తన కూతురిని అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జునకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది.

1985లో అక్కినేని, రామానాయుడు తమ వారసులు ఇద్దరు సినిమాల్లోకి వస్తున్నారని ప్రకటించడంతో సినీ పరిశ్రమలో ఆసక్తిని నెలకొల్పింది. అన్నట్టుగానే 1986లో అక్కినేని నాగార్జున తమ బ్యానర్ అయిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో వి.మధుసూధనరావు దర్శకత్వంలో శోభన హీరోయిన్ గా “విక్రమ్”అనే సినిమాలో నటించడం జరిగింది.

ఇదే సంవత్సరంలో డి.రామానాయుడు కుమారుడు వెంకటేష్ హీరోగా తమ సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఖుష్బు హీరోయిన్ గా “కలియుగ పాండవులు” చిత్రంలో నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అలా అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి, ప్రస్తుతం స్టార్ హీరోలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అయితే ఏఎన్ఆర్, రామానాయుడు ఇద్దరూ తమ పెద్ద కుమారులను నిర్మాతలుగా చేసి, చిన్న కుమారులను హీరోలుగా సినీ పరిశ్రమకు పరిచయం చేయడం ఒక విశేషం.






























