“వేణు తొట్టంపూడి” తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. హీరోగా మంచి కామెడీ టైమింగ్ తో తెలుగునాట సినీ ప్రేక్షకులను అలరించిన నటుడు వేణు తొట్టెంపూడి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు హీరో వేణు. అయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన “స్వయంవరం” సినిమాతో ఎప్పటికీ గుర్తుండిపోయే భారీ విజయాన్ని అందుకున్నాడు.

అంతేకాదు తొలి సినిమాతోనే స్పెషల్ జ్యూరీ క్యాటగిరిలో నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తరువాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి తనదైన నటనతో అందరినీ అలరించాడు. హీరోగా నటిస్తూనే మరోవైపు హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా సినిమాల్లో కమెడియన్ కం హీరోగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
తెలుగులో దాదాపు 26 సినిమాల్లో నటించిన వేణు 2009లో ‘గోపి గోపిక గోదారి’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అయన కెరీర్ కాస్త వెనుకపడింది. అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ “దమ్ము” చిత్రంలో నటించినా ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. చివరగా వేణు తొట్టెంపూడి నటించిన సినిమా “రామాచారి” ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపారవేత్తగా మారిపోయాడు వేణు తొట్టెంపూడి.
అయితే 2013 లోక్ సభ ఎన్నికల్లో అయన బావ నామా నాగేశ్వరరావు తరుపున ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం చేసాడు. వ్యాపారవేత్తగా రాణిస్తున్న వేణు. గత ఏడాది లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన పేదలకు తనవంతు సహాయం చేస్తూ తన మంచిమనసు చాటుకున్నాడు. అప్పట్లో ఆ పొటోలు వైరల్ అయ్యాయి కూడా. అయితే అవకాశం వస్తే మరోసారి వెండితెరపై తన సత్తా చాటడానికి రెడీ గా ఉన్నానని పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు.






























