ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. శాంతిని నెలకొల్పుతామని చెబుతూనే కాల్పులకు పాల్పడుతున్నారు తాలిబన్లు. ప్రతీ పట్టణాన్ని ఆక్రమించుకొని తమ అరాచకాలకు పదను పెట్టారు. దీంతో అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. అయితే ఇప్పటికీ అక్కడ వేరే దేశాలకు చెందిన కొందరు సిటిజన్లు చిక్కుకుపోయారు.

వారిని తమ దేశానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఉక్రెయిన్ విమానం అక్కడ హైజాక్ కు గురైంది. కాబూల్ కి వెళ్లిన ఆ విమానం తమ పౌరుల్ని ఎక్కించుకొని తిరిగి స్వదేశానికి వెళ్తున్న క్రమంలో విమానాన్ని గుర్తుతెలియని వ్యక్తులు హైజాక్ చేసి ఇరాన్ కు తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి యెనిన్ ప్రకటించారు. హైజాక్ అయిన విమానంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనతో కాబూల్ కు రాకపోకలు నిర్వహించే అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నీ తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు. పైకి హైజాక్ అని చెప్తున్నా.. సాంకేతికంగా చోరీ జరిగినట్లేనని ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి తెలిపారు. అయితే విమానాన్ని ఎవరు హైజాక్ చేశారు అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాబూల్ ఎయిర్ పోర్టు మొత్తం నాటో, అమెరికా దళాల ఆధీనంలో ఉంది. అక్కడ ఏ విమానం అయినా విదేశాలకు వెళ్లాలంటే అమెరికా సైన్యం అనుమతి అనేది తప్పని సరి. అయినా ఇలా జరగడం అనేది అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్వదేశాలకు వెళ్లాలనుకునే పౌరులకు ఈ ఘటనతో మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు.































