విజయవాడలో(బెజవాడ) ‘అఖండ’ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఇంద్రకీలాద్రిపై ఉన్న కోటను బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. ‘అఖండ’ సినిమా విజయంతో బాలయ్య ఆనందంలో ఉన్నారు. సినిమా విడుదలైన వారం రోజుల్లోపే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిందీ మూవీ. ఓవర్సీస్లోనూ దుమ్ము దులుపుతోంది. పేరుకు తగ్గట్టే.. కలెక్షన్లను రికార్డులను బద్దలు కొడుతోంది.

సనాతన ధర్మాన్ని చాటి చెప్పిన సినిమా ‘అఖండ’ అని బాలకృష్ణ అన్నారు. ధర్మాన్ని కాపాడితే.. ఆ ధర్మమే మనలను కాపాడుకుంటుందనే విషయాన్ని ఈ సినిమాలో చూపించామని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధించిందని, అందుకే మొక్కులు చెల్లించుకున్నామని చెప్పారు. ‘అఖండ’ విడుదలయ్యాక నిర్మాతలకు ధైర్యం వచ్చి తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు.
ఈ సినిమా రాబోయో సినిమాలకు ఊరటను ఇచ్చిందన్నారు. దర్శకులు ముందుకు వచ్చి మంచి కథ తెస్తే.. మల్టీస్టారర్ చేస్తా అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇక ఇంతటి ఘనవిజయం సాధించిన ‘అఖండ’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో టిక్కెట్ రేట్లు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టిక్కెట్ల విధానంపై హీరో బాలకృష్ణ మాట్లాడారు. టికెట్ రేట్లపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే.. నిర్మాతలు కూడా వెళతారని బాలకృష్ణ అన్నారు.
అన్నింటికీ సిద్ధమైమయ్యే సినిమాను విడుదల చేశామన్నారు. దేవుడే న్యాయమూర్తి.. దేవుడు ఉంటాడు అంటారు. సినిమా పరిశ్రమను తప్పకుండా ఆదుకుంటామని బాలయ్య అన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి బాలకృష్ణ మంగళవారం రాత్రే విజయవాడకు చేరుకున్నారు. రాత్రి 10:30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు. సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు.
































