సాధారణంగా సినిమాల కోసం పురాణాలు, ఇతిహాసాలు ఆధారం చేసుకుని రచయితలు అనేక కథలను అల్లుతూ ఉంటారు. కొన్నికొన్ని సందర్భాల్లో నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఉత్తేజపరచడం తో వాటిలో కొంత భాగాన్ని కావచ్చు లేదా మొత్తంగా కావచ్చు ఒక సినిమాగా తీయడం అనేది జరుగుతూ ఉంటుంది.అలా నిజజీవితంలో జరిగిన అనేక సంఘటనలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం మనం ఇదివరకే గమనించాం.

1988లో సినిమాలపై ఇష్టంతో హైదరాబాద్ వచ్చిన రాంగోపాల్ వర్మ ఎలాగైనా డైరెక్టర్ కావాలన్న ఆలోచనతో కొన్ని వ్యయప్రయాసలకు ఓర్చుకుని చివరకు నాగార్జునకు ఒక హారర్ స్టోరీ చెప్పడం జరిగింది. హారర్ స్టోరీని ఎవరు చూస్తారని నాగార్జున తిరస్కరించారు. ఆ క్రమంలో రామ్ గోపాల్ వర్మ తన విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్ డేస్ లో జరిగిన కొన్ని గొడవలను ఆధారం చేసుకుని కొత్తగా ఒక కథ తయారు చేయడం జరిగింది. ఆ కథ నాగార్జునకు నచ్చడంతో అక్కినేని బ్యానర్ లో నాగార్జున, అమల హీరో హీరోయిన్లుగా శివ సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. రామ్ గోపాల్ వర్మ కి మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ వచ్చింది.

నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ ఒకప్పుడు చిరంజీవితో ‘కోతల రాయుడు’ లాంటి సినిమాని తీయడం జరిగింది. ఆ తర్వాత కొత్తవారితో 1988లో మాలాశ్రీ, కిన్నెర, రెహ్మాన్ లతో మన్మధ సామ్రాజ్యం అనే సినిమాకి మొదటగా దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత శివ సినిమా విడుదలైన సంవత్సరానికి 1990 లో తమ్మారెడ్డి సొంత బ్యానర్, స్వీయ దర్శకత్వంలో భానుచందర్, నరేష్ రెహ్మాన్, కుష్బూ ప్రధాన పాత్రలో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన గొడవల ఆధారంగా అలజడి అనే సినిమాని రూపొందించడం జరిగింది.

ఉస్మానియా కాలేజ్ లో మరణించిన జార్జిరెడ్డి పాత్రను భానుచందర్ పోషించడం జరిగింది. ఇలా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకొని తీసిన శివ, అలజడి రెండు సూపర్ హిట్ అవ్వడం జరిగింది.వరుసగా ఫ్లాప్ లతో ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ్ కి అలజడి సినిమా సూపర్ హిట్టై లాభాలు తెచ్చింది.
































