ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మర్చి నెల జీతాన్ని రెండు దఫాలుగా చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధక్షుడు కె. ఆర్. సూర్యనారాయణ వెల్లడించారు. ఇవాళ సీఎం జగన్ తో భేటీ అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. ఇది విరాళం కాదని, జీతంలో కోత కాదని అయన తెలిపారు. కేవలం ఇబ్బందుల కారణంగా రెండు దఫాలుగా మార్చి జీతం ఇస్తామన్నారని తెలిపారు. కేవలం సగం జీతం ఇప్పుడు ఇచ్చి, మిగతా జీతం తరువాత ఇస్తారని చెప్పారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు బాగాలేవని లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం ఆగిపోయిందని అయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ఉద్యోగులందరి తరుపున మేము సహకరిస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నారు నిన్న అధికారికంగా ప్రకటించారు. తెలంగాణాలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ (కార్పొరేషన్)ల ఛైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించారు. మిగతా అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం (నాలుగో తరగతి మినహా), నాలుగో తరగతి, ఒప్పంద(కాంట్రాక్టు), పొరుగు సేవల (ఔట్ సోర్సింగ్) ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం వేతనాలకు కోత పడనుంది. అంతేకాకుండాఅన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో 50 శాతం, నాలుగో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛనులో 10 శాతం కోత విధిస్తారు.అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల మాదిరిగానే వేతనాల్లో కోత ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం వెల్లడించారు.

మరో వైపు ఇదే బాటలో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర కూడా పయనించింది. ఒకటి , రెండో తరగతి ఉద్యోగుల జీతాల్లో 50% కోత విధించబోతున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మూడవ తరగతి ఉద్యోగుల జీతాల్లో 25% కోతలు విధిస్తున్నట్టు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాల్లో మాత్రం ఎటువంటి కోత విధించడం లేదని తెలిపింది.































