“గృహమే కదా నా స్వర్గ సీమ” అన్నాడో సినీ కవి. సొంత ఇంట్లో ఉండే భరోసా వేరు. అందుకే సొంత ఇంటి కలని నిజం చేసుకోవాలని కలలు కనని వారు ఎవరు ఉంటారు చెప్పండి? కానీ కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వలన ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. కేవలం కొంత మంది మాత్రమే తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు. కానీ ఇలాంటి ఆర్ధిక సంక్షోభంలోనూ అవకాశాలు లభిస్తాయని చెప్పినట్లు ప్రస్తుతం సొంత ఇంటి కలను నిజం చేసుకునేవారికోసం ఒక అవకాశం కనిపిస్తోంది. ఇది కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల లభించిన అవకాశం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా కంటే ముందు ఇండియాలో వడ్డీ రేట్లకు, ఇప్పుడు ఉన్న వడ్డీ రేట్లకు చాలా తేడా ఉంది. అంతే కాకుండా ఇంటి కోసం ఋణం తీసుకున్నాక కూడా మారటోరియం వినియోగించుకునే అవకాశం కూడా ఉందిప్పుడు. అలాగే కరోనా దెబ్బతో ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్ధిక మాంద్యం మొదలయ్యింది.

ఈ దెబ్బతో పలురంగాల్లో ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. కొన్ని కంపెనీలు తమ భారం దించుకోవడానికి ఉద్యోగాల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు అప్పటికే ఉన్న కమిట్ మెంట్స్ వల్ల కొందరు ఉద్యోగులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతుంటారు. సడెన్ గా ఉద్యోగం కోల్పోవడం వల్ల గృహ రుణాల తీసుకున్నట్లయితే, ఆర్ధిక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయాలో సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఏ ఏ అవకాశాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
జాబ్ పోయిన నేపథ్యంలో హౌస్ లోన్ తిరిగి ఎలా చెల్లించాలా అని బాధ పడుతుండటం సహజం అలాగే కొంతమంది బ్యాంకులో ఇచ్చిన చిరునామా నుండి ఖాళీ చేసి దూరంగా వెళ్లిపోతుంటారు. హౌస్ రుణం తిరిగి చెల్లించలేనందుకు బ్యాంక్ తమను వేధించవచ్చని భయపడుతుంటారు… ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే.. కొత్తగా ఇల్లు కొనాలన్నా.. హౌస్ లోన్ ని తీర్చాలన్నా వినియోగదారులు ఇప్పుడు బిల్డర్లతో భేషుగ్గా బేరమాడవచ్చు. ఎందుకంటే వారికి గత 2 నెలలుగా వ్యాపారం లేక నిధుల లభ్యత సమస్య ఎదురైంది. ఇప్పుడు వారికి నగదు ప్రవాహం అవసరం. కాబట్టి వారి లాభాల్లో చాలా మట్టుకు తగ్గించుకునేందుకు ముందుకు వస్తారు. కాబట్టి ఇల్లు కొనాలనుకునేవారికి ఇదే కర్రెక్ట్ సమయం అని చెప్పొచ్చు. పన్ను తగ్గింపు లేదు, కరోనా వైరస్ దెబ్బకు దేశ ఆర్ధిక వ్యవస్థ బాగా దెబ్బతింది. భారత్ లో కూడా గత 4 నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. బతుకు భారమై పోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ 40 ఏళ్ళ లో చూడనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. జీడీపీ వృద్ధి రేటు నెగటివ్ కు పడిపోయింది.
ఈ సంక్షోభంలో నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయి. ఆర్బీఐ పలు మార్లు వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు సుమారు 10-15 ఏళ్ళ కనిష్ఠానికి దిగి వచ్చాయి. దీంతో వినియోగదారులకు ఆర్థికంగా చాలా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రూ 30 లక్షలకు రూ 20 వేలే.. ఇండియాలో భారతీయ స్టేట్ బ్యాంకు ప్రతీ విషయంలోనూ చాలా ముందు ఉంటుంది. ఇదే రుణాలపై వడ్డీ రేట్లను శాశించే ట్రెండ్ సృష్టిస్తుంది. సరిగ్గా ఇప్పుడు అలాగే ఎస్బీఐ మరోసారి ఇంటరెస్ట్ రేట్లను తగ్గించి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలిసింది. దీంతో ఎస్బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లను అతి కనిష్టంగా 7.05% కి అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో మిగితా బ్యాంకులు కూడా దీనినే ఫాలో అవుతాయి. కాకపొతే వాటి వడ్డీ రేట్లు కాస్త అధికంగా 7.5% వరకు ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఎస్బీఐ లో సుమారు రూ 30,00,000 హోమ్ లోన్ తీసుకుంటే ఈఎంఐ కేవలం రూ 23,000 మేరకు ఉండనుంది. నాలుగు ఐదేళ్ల క్రితం ఇంతే రుణంపై వడ్డీ రేటు 10-11% గా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ఈఎంఐ సుమారు రూ 30,000 స్థాయిలో ఉండేది. మొదటిసారిగా గృహాలు కొనుగోలు చేసే పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రస్తుతం తగ్గిన గృహ రుణాల వడ్డీ రేట్లతో మరింత మేలు జరగనుంది.
అందరికీ గృహాలు కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోయర్ ఇన్కమ్ గ్రూప్ వర్గాలకు వడ్డీలో 4% రిబేటు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వారికి వడ్డీ లో 2% రిబేటు లభిస్తుంది. గరిష్టంగా రూ 2.60 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. ఇది కూడా బ్యాంకులకు నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి… ఆ మేరకు వారు చెల్లించాల్సిన రుణ భారం తగ్గి పోతుంది. ఈ మొత్తాన్ని అసలు కింద జమ చేస్తారు కాబట్టి, మిగిలిన రుణం తక్కువ కాలంలోనే తీరిపోతుంది. కాబట్టి, వచ్చే 6 నెలల నుంచి ఏడాది లోపు కొత్తగా గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఏడాది తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే పరిస్థితులు మారిపోవచ్చు. అలాగే మీ జాబ్ పోయిన తర్వాత మీ రుణం డిఫాల్ట్ అయినట్లయితే, ఆ రుణ ఖాతాను వెంటనే మూసివేసి, మీ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ఏ బ్యాంక్ ఇష్టపడదు. అందుకు బదులుగా, బ్యాంకు మొదటి ప్రయత్నంగా బకాయి ఉన్న రుణ మొత్తాన్ని తిరిగి పొందడమే ఉంటుంది. కాబట్టి బ్యాంక్ మీతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తుంది. మీకు EMI చెల్లించడానికి డబ్బు లేకపోతే, పరిస్థితిని పరిష్కరించడానికి ప్రయత్నించండి.
అలాంటి పరిస్థితిలో, ముందు మీరు కొత్త ఉద్యోగాన్ని వెతుక్కొండి. అయితే గతంలో లాగా కొత్త ఉద్యోగంలో మీకంత జీతం మీకు లభించకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో, మీరు బ్యాంకును కలుసుకోవాలి, హౌస్ ఋణం రీస్ట్రక్చర్ గురించి మాట్లాడాలి. మీ లోన్ EMI మొదటి 20 సంవత్సరాలకు 10,000 రూపాయలనుకుందాం, అప్పుడు మీరు దానిని 30 సంవత్సరాలకు 6000 రూపాయలకు తగ్గించమని బ్యాంకుకు రిక్వెస్ట్ చేయవచ్చు. దీంతో EMI ని తగ్గిస్తుంది. పదవీకాలం పెంచుతుంది. ఇది మీపై భారాన్ని కూడా తగ్గిస్తుంది. పదవీకాలం పెరుగుదల కారణంగా మీరు రుణంపై ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది, కాని భారం ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే RBI ఇప్పటికే ఆగస్టు 31 వరకూ మారిటోరియం ప్రకటించింది. అయినప్పటికీ మీరు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే మరికొన్ని రోజుల పాటు బ్యాంకు నుండి కొన్ని నెలల వాయిదా కూడా అడగొచ్చు. మీ ప్రీవియస్ హిస్టరీ ఆధారంగా బ్యాంక్ మీకు వాయిదాల సమయం కేటాయించవచ్చో లేదో నిర్ణయిస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించకుండా మీరు డిఫాల్ట్ అయితే, బ్యాంకు క్రెడిట్ స్కోరు మీద కూడా ఆ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు మీ సొంతింటి కలని నిజం చేసుకోండి.






























