టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామరస్ పాత్రలో నటించకుండా అద్భుతమైన నటనతో అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర సంపాదించుకున్న నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య కన్నడ నటి అయినప్పటికీ అచ్చతెలుగు అమ్మాయిలా ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎనలేని ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె బాలకృష్ణ సరసన కూడా నటించడానికి ఒప్పుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎన్నో పౌరాణిక చిత్రాలలో నటించి అద్భుతంగా మెప్పించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన కలల ప్రాజెక్ట్ అయినటువంటి “నర్తనశాల” సినిమాకు మొట్టమొదటిసారిగా దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో పర్ణశాల సెట్ కూడా వేసి ఒక షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.
నర్తనశాల సినిమాలో సౌందర్య ద్రౌపది పాత్ర పోషిస్తోంది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత సౌందర్య రాజకీయాలలోకి వచ్చి బిజెపి తరఫున ప్రచారం కోసం బెంగళూరు నుంచి కరీంనగర్ కి ఎయిర్ క్రాఫ్ట్ లో తన అన్నయ్యతో కలసి వస్తుండగా 2004 ఏప్రిల్ 17న విమానం కూలి తన అన్నయ్య అమర్ నాథ్ తో పాటు మరణించారు. ఈ విధంగా సౌందర్య మృతిచెందడంతో నర్తనశాల సినిమా అక్కడితో ఆగిపోయింది.
నిజానికి ఈ సినిమా కేవలం ఒక షెడ్యూల్ షూటింగ్ ను మాత్రమే జరుపుకుంది.ఈ క్రమంలోనే సౌందర్య స్థానంలో మరొక హీరోయిన్ ను తీసుకొని ఈ సినిమాను పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ బాలకృష్ణ సౌందర్య స్థానంలో మరొక హీరోయిన్ ను ఊహించుకోలేక, తన కలల ప్రాజెక్ట్ అయినటువంటి నర్తనశాల సినిమా అంతటితో ఆపివేశారు.































