దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దసరా, దీపావళి పండుగల సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఈకామర్స్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయనే కారణంతో నోటీసులు జారీ చేసింది. కేంద్రం ఈ రెండు కంపెనీల వైఖరిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. 
గతంలో ఏ సంస్థ అయినా వస్తువులను విక్రయానికి అందుబాటులో ఉంచితే ఆ వస్తువు తయారైన దేశం పేరు ఉండాలని నిబంధనను విధించామని అయితే ఆ నిబంధనలను పట్టించుకోకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ విక్రయాలను చేపడుతున్నాయని పేర్కొంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వస్తువులపై దేశం, ఇతర వివరాలను ఎందుకు పొందుపరచలేదో వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
త్వరలో దసరా, దీపావళి పండుగలు ఉన్న నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో నిన్నటి నుండి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ పేరుతో పండగ సేల్స్ ను ప్రారంభించాయి. కళ్లు చెదిరే ఆఫర్లను ఈ రెండు ఈకామర్స్ సంస్థలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్ కార్ట్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆఫర్లను అందుబాటులో ఉంచనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులను నిన్నటి నుంచే ఆఫర్లు అందుబాటులోకి రాగా సాధారణ కస్టమర్లకు నేటి నుంచి ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ సంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. కేంద్రం నోటీసులకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఏమని వివరణ ఇస్తాయో చూడాల్సి ఉంది. చైనా ఉత్పత్తుల వినియోగం నెమ్మదిగా దేశంలో తగ్గేలా చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనలను అమలులోకి తెచ్చింది.































