ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయిన తరువాత ఏపీకి ఆదాయంతో పోలిస్తే ఖర్చులు పెరిగాయి. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అప్పులు చేసి ఏపీ అప్పులను మరింత పెంచింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ సైతం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం అప్పులపైనే ఆధారపడుతోంది. అప్పులు పెరుగుతున్న స్థాయిలో రాష్ట్రానికి ఆదాయం పెరగడం లేదు.

కరోనా వైరస్, లాక్ డౌన్ ఏపీకి ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి. ఇలాంటి సమయంలో కేంద్రం జగన్ సర్కార్ కు అదిరిపోయే తీపికబురు చెప్పింది. రాష్ట్రాలకు కేంద్రం రుణాలను తీసుకునే అవకాశం కల్పించింది. కేంద్రం రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలను చెల్లించాల్సి ఉన్నా ఆ బకాయిలను ఇప్పటివరకు చెల్లించని నేపథ్యంలో రుణాలు తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడం ద్వారా రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది.
కేంద్రం జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు 2.35 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కేంద్రం 20 రాష్ట్రాలు 68 వేల కోట్ల రూపాయలకు పైగా రుణాన్ని ఆర్బీఐ నుంచి తీసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఈ ఆప్షన్ నచ్చని రాష్ట్రాలు పరిహారం మొత్తం మార్కెట్ నుంచి తీసుకోవాల్సిందిగా సూచనలు చేసింది. ఆర్బీఐ ద్వారా రుణం తీసుకోవవడానికి ఏపీ సుముఖత వ్యక్తం చేసింది.
5,051 కోట్ల రూపాయలు కేంద్రం అనుమతితో రాష్ట్రం అప్పుగా తీసుకోనుంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థికరమైన కష్టాలను ఎదుర్కొంటున్న ఏపీకి ఇది శుభవార్త అనే చెప్పాలి. కరోనా, లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ నుంచి జులై నెలల మధ్య రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో కేంద్రం నిర్ణయం ద్వారా ఏపీకి భారీ ఊరట కలిగిందనే చెప్పాలి.



































