గత రెండు నెలలుగా కరోనా రెండో దశ భారతదేశంపై ఎలా ఉందో మనందరికి తెలిసిందే. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఈ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికి అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేశాయి. ఈ విధంగా కరోనా మహమ్మారిను అదుపు చేయడం కోసం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా రెండవ దశ ప్రమాదం ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మన దేశంలో ఇప్పటికి ఆరు రాష్ట్రాలలో కరోనా కేసులు రోజుకి తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయని, ఈ మహమ్మారి నుంచి పూర్తిగా మనం కోలుకోలేదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.జూన్ 23-29 మధ్యలో దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా ఉంది. అందువల్ల ఈ వేవ్ నుంచి మనకు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా కేసులు పలు రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టాయని ప్రజలు ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించిన వద్దు, నిర్లక్ష్యం కారణంగా మరోసారి వ్యాధి తీవ్రతకు కారణం అవుతాయని, ఈ వ్యాధిని అరికట్టడం కోసం వ్యాక్సిన్ కూడా శరవేగంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు కొంతవరకు పెరిగినప్పటికీ జూన్ 30 నాటికి మన దేశంలో పలు రాష్ట్రాల్లో 53 డెల్టా కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలియజేశారు.
ఈ విధంగా వివిధ రూపాలలో ఉత్పరివర్తనం చెందుతున్న వైరస్ నుంచి ప్రజలను కాపాడటం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి యావరేజ్ గా రోజుకు 50 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లను అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఈ క్రమంలోనే ప్రజలందరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు.




























