కరోనా ప్రపంచాన్ని దడదడలాడిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికాని కూడా వదిలి పెట్టడంలేదు. ప్రస్తుత్త గణాంకాల ప్రకారం అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్నది అమెరికా లోనే. ఆరోగ్య పరంగానే కాదు.. ఆర్ధిక పరంగా కూడా అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అమెరికాలోని చాలా ప్రాంతాలలో అత్యవసర సర్వీసులు తప్పితే మిగిలిన వ్యాపారాలు అన్ని మూసివేశారు. ఈ కరోనా కారణంగా చాలా కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగించేలేకపోతున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీలు అనేక ఆర్ధిక నష్టాలను చవిచూస్తున్నాయి. దీని కారణంగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సైతం చెల్లించలేని పరిస్థితికి వచ్చేసాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్యామిలీ నడిపిస్తున్న డి ట్రంప్ ఆర్గనైజేషన్ కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సమస్యల కారణంగా తాము చెల్లించాల్సిన రుణాలను వాయిదా వేయాలని ఈ కంపెనీ డ్యూయిష్ బ్యాంకును కోరినట్టు ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మార్చి లో చెల్లించాల్సిన రుణాలను వాయిదా వేయాల్సిందిగా ఆ కంపెనీ బ్యాంకును కోరినట్టు తెలిపింది.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరు కలిసి సమన్వయంతో ముందుకు నడిస్తే మంచిదని ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ తెలిపాడు. ప్రస్తుతం ట్రంప్ వ్యాపారాలను ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ చూస్తున్నాడు. ది ట్రంప్ ఆర్గనైజేషన్ డ్యూయిష్ బ్యాంకుకు వంద మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ రుణం వాయిదా విషయంపై ఇంకా డ్యూయిష్ బ్యాంకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.





























