కరోనా నుంచి మనకు మనం రక్షించుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అంటూ వైద్య నిపుణులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. దానినే ప్రపంచంలోనే అన్ని దేశాలో ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి కూడా. దీంతో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా దేశాలు 50 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నాయి. మరిన్ని దేశాల్లో మందకొడిగా సాగుతోంది. అయితే, అభివృద్ది చెందిన దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు.

దీంతో అక్కడి ప్రభుత్వాలు వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలను ప్రొత్సహించేందుకు కొత్త స్కీమ్స్తో ఆకట్టుకుంటున్నారు. బ్రిటన్లో ఇప్పుడు ఇదే చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాపింగ్ వోచర్లు, పిజ్జా డిస్కౌంట్లు, ప్రయాణాల్లో రాయితీల పేరుతో వ్యాక్సిన్ వోచర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అనేక రైడ్-హెయిలింగ్, ఫుడ్ డెలివరీ యాప్లు టీకా తీసుకున్న వారికి ప్రయాణ, భోజన రాయితీలు కల్పిస్తున్నాయి.
బ్రిటన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాక్సిన్ వోచర్స్ లో ఉబెర్, బోల్ట్, డెలివెరూ, పిజ్జా పిలిగ్రిమ్స్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇలాంటి పథకాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే పలు కంపెనీలు, ఫుడ్ డెలివరీ యాప్ లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నాయి.
వినియోగదారులకు వివిధ రాయితీలు ప్రకటిండచమే కాకుండా వారు మొదటి, రెండో డోసు టీకా వేసుకునేందుకు తమ వంతుగా సహాయపడతామని పిజ్జా పిలిగ్రిమ్స్ వ్యవస్థాపకుడు థామ్ ఇలియట్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ విధానం ప్రవేశ పెట్టడంతో మరికొంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పథకం వినియోగదారులకు చేరువ అవుతుందని ఆయా సంస్థలు చెబుతున్నాయి.































