ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రరూపం దాల్చుతోంది.ఈ మహమ్మారి దాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.మరో వైపు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితులను చూసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా తీవ్రత ఇప్పుడప్పుడే తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు.

రెండవ దశ తీవ్రతతో దేశం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది.ఈ తరుణంలో ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ మహమ్మారి నుంచి బయట పడతామా అని ఎదురు చూస్తూ ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఈ మహమ్మారి గురించి మరో పిడుగులాంటి వార్తను తెలిపింది. కరోనా రెండవ దశను ఎదుర్కోవడమే కాకుండా మూడవ దశకి కూడా సిద్ధంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ దేశ ప్రజలను హెచ్చరించారు.
మొదటి దశ విజృంభిస్తున్న సమయంలోనే రెండవ దశ మరింత తీవ్రంగా ఉంటుందని పలుమార్లు హెచ్చరించాం. వైరస్ ఎక్కడికి పోలేదని, ఇతర దేశాలలో కూడా పలు వేవ్ ల రూపంలో వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు. అయితే భారత్ లో ఇంత దారుణ పరిస్థితులు ఏర్పడతాయని ఊహించలేదని వీకే పాల్ తెలిపారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులను ప్రతి ఒక్కరు కలిసి ఎదుర్కోవాలి. రెండవ దశలో పరిస్థితి తీవ్రంగా ఉండగా, వైరస్ మళ్లీ విజృంభిస్తుంది అని కూడా ఇది వరకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.అయితే ఈ విషయాలన్నీ ముందుగానే చెప్పి దేశ ప్రజలను భయాందోళనకు గురి చేయాలని కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే హెచ్చరిస్తున్నామన్నారు.































