అమరావతి: సినిమా కథల ప్రభావంపై సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇవాళ విడుదల కాగా, ఈ సినిమాపై సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చారిత్రక ఆధారాలు లేని ఒక ఊహాజనిత కథ ఆధారంగా సినిమాను నిర్మించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇందులో చూపిన కథను పవన్ అభిమానులు, సామాన్య ప్రజలు నిజమైన చరిత్రగా భావించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ: “మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం”
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్కు ఒక బహిరంగ లేఖ రాసిన వి.శ్రీనివాసరావు, “ఈ సినిమా వల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టబడే ప్రమాదం ఉంది. ఇది జాతీయ సమైక్యతకు కూడా వ్యతిరేకంగా ఉంటుంది” అని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా కథను పూర్తిగా కల్పితమని, చారిత్రక వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్ వహించాలని డిమాండ్ చేశారు. పవన్ ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న రాజకీయ నాయకుడిగా ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలన్నారు.
కోహినూర్ వజ్రం చరిత్ర, బ్రిటిష్ పాత్రపై విమర్శలు
కోహినూర్ వజ్రం చరిత్రను ప్రస్తావించిన వి.శ్రీనివాసరావు, దాని ప్రయాణాన్ని స్పష్టంగా వివరించారు. కోహినూర్ వజ్రం మొదట కాకతీయుల చేతికి వెళ్లి, అక్కడినుంచి ఢిల్లీ సుల్తానులకు, మోగలులకు, నాదీర్ షాకు, ఆఫ్ఘాన్ రాజులకు, పంజాబ్ సిక్కు మహారాజుకు, చివరకు బ్రిటిష్ వారికి చేరిందని తెలిపారు. బ్రిటిష్ వారు దాన్ని లండన్ తరలించారని, అది ఇప్పటివరకు తిరిగి భారతదేశానికి రాలేదని అన్నారు.
అలానే, సినిమాలో బ్రిటిష్ పాత్రను పూర్తిగా విస్మరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మఘల్ చక్రవర్తుల సంపద భారతదేశంలోనే ఉండిపోవడం, బ్రిటిష్ వలస పాలకులు మాత్రం ఆ సంపదను విదేశాలకు తరలించడం వాస్తవమని స్పష్టం చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విభజించిన బ్రిటిష్ వారి పాత్రను పవన్ కల్యాణ్ గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కేంద్రం, పవన్కు విజ్ఞప్తి: కోహినూర్ను తిరిగి రప్పించాలి లేదా విద్వేషాలు నివారించాలి
ముఖ్యంగా దేశభక్తి గురించి పదే పదే మాట్లాడుతున్న నరేంద్ర మోదీ సర్కారు ఇప్పటికీ కోహినూర్ వజ్రాన్ని తిరిగి రప్పించేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో పవన్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వజ్రాన్ని తిరిగి తీసుకురావాలన్నా, లేదా కల్పిత కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని నివారించాలన్నా, రెండింటిలో ఒక్కదాన్ని కనీసం చేయాలని కోరారు. ఇది దేశ ప్రయోజనాలకే కాకుండా ప్రజల మానసిక శాంతికి కూడా అవసరమని సూచించారు.































