CVL Narasihma rao: ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ కు మధ్య టికెట్ ధరలపై వివాదం నడుస్తూనే ఉంది. టికెట్ ధరలను భారీగా తగ్గించడంపై ఇండస్ట్రీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వం, అటు టాలీవుడ్ మధ్య మాటల యుద్దం కూడా జరుగుతోంది.

అయితే టికెట్ ధరల తగ్గింపు పై ఇప్పటికే పలు మార్లు ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వంతో సమావేశం అయ్యారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంపై వెనక్కి వెళ్లేలా కనిపించడం లేదు. టికెట్ ధరపై వరసగా ఎవరో ఒకరు కామెంట్ చేస్తూ అగ్గి రాజేస్తున్నారు. గతంలో శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు ముందు హీరో నాని.. థియేటర్ల కలెక్షన్లకు, కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ కామెంట్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్సందించాడు. హీరో నానికి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ, మంత్రి పేర్ని నాని మధ్య ట్విట్ వార్ జరుగుతోంది.
పెద్ద సినిమాలు చేస్తామంటున్న నిర్మాతలు..
ఇదిలా ఉంటే కొంతమంది చిన్న నిర్మాతలు, సినీ ఇండస్ట్రీ వ్యక్తులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్రముఖ నటుడు సీవీఎల్ నరసింహరావు అన్నారు. పది మంది ప్రోడ్యూసర్లు సినిమా టికెట్లపై రాద్ధాంతం చేస్తున్నారని అయన అన్నారు. పెద్ద సినిమాలు చేస్తామంటున్న నిర్మాతలు కింది స్థాయి కార్మికులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మామూలు సినిమా అభిమాని టికెట్ ధర రూ. 1000 ఉంటే ఫ్యామిలీతో ఎలా సినిమా చూడగలుగుతాడని ప్రశ్నించారు. సినిమా టికెట్ల ధరల పై ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఈ సందర్భంగా సీవీఎల్ నరసింహ రావు పేర్కొన్నారు.
































